
భద్రత కట్టుదిట్టం
● పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో తూర్పు నౌకాదళం అప్రమత్తం ● సాగరజలాల్లో దూకుడుగా సన్రైజ్ ఫ్లీట్ ● సమర సన్నద్ధతపై సమీక్షించిన ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ పెందార్కర్ ● ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలన్న తూర్పు నౌకాదళం ● వార్షిప్స్, సబ్మైరెన్లలో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు ● సముద్ర జలాల్లో పహారా కాస్తున్న యుద్ధ నౌకలు ● సాగర గర్భంలో మాటువేసిన జలాంతర్గాములు
సాక్షి, విశాఖపట్నం : ముష్కరుల దమనకాండతో భారత్ రగిలిపోతోంది. దౌత్య పరమైన చర్యలు ఇప్పటికే తీసుకొని పాక్ మూలాలపై దెబ్బకొట్టిన భారత్.. మరో అడుగు ముందుకేసి.. సమరానికై నా సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. దేశ సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళం సిద్ధమవుతోంది. సాగర జలాల్లో యుద్ధ సన్నద్ధతను చాటుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. పాక్ నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు తీరంలో గస్తీని పెంచింది. సన్రైజ్ ఫ్లీట్ను అప్రమత్తం చేస్తూ ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏ సమయంలోనైనా ఎక్కడ నుంచైనా పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, సబ్మైరెన్లు పహారా కాస్తున్నాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకూ వార్షిప్స్, సబ్మైరెన్లలో విధులు నిర్వర్తించే సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు నౌకాదళ వర్గాలు చెబుతున్నాయి.
ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్ధితులను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధమవుతున్నాయి. ఇదే క్రమంలో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు నౌకాదళం కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయి. దీంతో ఈస్ట్రన్ నేవల్ కమాండ్లో అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో గస్తీని పెంచడంతో పాటు యుద్ధ నౌకలు, సబ్మైరెన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సెలవులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. తూర్పు నౌకాదళ పరిధిలోకి ఇతరుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు. తూర్పు నౌకాదళాధిపతి రాజేష్ పెందార్కర్ తూర్పు స్వార్డ్ సన్రైజ్ ఫ్లీట్ సిబ్బందితో గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం నిర్వహించారు. నేవల్ బేస్లో జరిగిన ఈ సమావేశంలో ఇటీవల చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించిన సన్రైజ్ ఫ్లీట్ సిబ్బందిని ప్రశంసించారు. దేశ కార్యాచరణ అవసరాలు తీర్చేందుకు ప్రతి ఒక్క సెయిలర్, అధికారి సిద్ధంగా ఉండాలని ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భద్రతా పరిస్థితిపై మరింత దృష్టిసారించాలంటూ దిశానిర్దేశం చేశారు. అత్యవసర కార్యకలాపాలకు సంయమనంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. మారిటైమ్ భద్రత, కార్యాచరణ సవాళ్లతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిపైనా దృష్టి సారించాలన్నారు. వ్యక్తిగత భద్రత, సైబర్, సమాచార భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. దేశ ప్రయోజనాల కోసం.. భారతీయుల భద్రత కోసం ఎక్కడ నుంచైనా.. ఏ సమయంలోనైనా పోరాటం సాగించేందుకు సన్రైజ్ ఫ్లీట్ సిద్ధంగా ఉందన్న నమ్మకాన్ని దేశానికి కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పిలుపునిచ్చారు.
ఎలాంటి కవ్వింపు చర్యలనైనా ఎదుర్కొనేలా..
గతంలోనూ చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడు తూర్పు నౌకాదళం వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. 1971లో పాక్పై విజయం సాధించడంలో ఈస్ట్రన్ నేవల్కమాండ్ కీలక పాత్ర పోషించింది. మన యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు పాక్ మరోసారి ఏమైనా చర్యలకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో బంగాళాఖాతంలో ఈఎన్సీ గస్తీ పెంచింది. తూర్పు నౌకాదళ పరిధిలో ఉన్న సుమారు 60 యుద్ధ నౌకలతో పాటు 6కిపైగా సబ్మైరెన్లు రంగంలోకి దిగాయి. సముద్ర జలాల్లో వార్షిప్స్ పహారా కాస్తుండగా.. సాగర గర్భంలో సబ్మైరెన్లు ఎలాంటి విపత్తునైనా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేశాయి. మరోవైపు.. కోస్ట్ గార్డ్ నౌకలతో నిరంతరం సముద్రంలో పహారా కాస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ప్రత్యర్థి వ్యూహాలను అంచనా వేస్తున్నారు.

భద్రత కట్టుదిట్టం