
అవిశ్వాసం!
డిప్యూటీ మేయర్పై
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ మేయర్ సీటు తమదేనని జనసేన నేతలు ప్రచారం చేస్తుండగా, కాదు కాదు మాకేనని టీడీపీ మేయర్ అభ్యర్థి పీలా శ్రీనివాసరావు అనుచరులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, డిప్యూటీ మేయర్ పదవి ఎవరికి కట్టబెడతారో తేల్చకుండానే కూటమి అవిశ్వాసానికి సిద్ధమైంది. శనివారం డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్పై అవిశ్వాసానికి కూటమి ఏర్పాట్లు చేసింది. డిప్యూటీ మేయర్ ఎవరికి ఇస్తారో తేల్చకుండా అవిశ్వాసానికి కూటమి నేతలు వెళుతుండడంతో కార్పొరేటర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమ వర్గానికి డిప్యూటీ మేయర్ పదవిపై స్పష్టత ఇస్తే తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటామని పదవి ఆశిస్తున్న కార్పొరేటర్లు కూటమి నేతలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ముందుగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిని ప్రకటిస్తే, మిగిలిన నేతల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో అవిశ్వాసం వీగిపోయే ప్రమాదముందని కూటమి నేతలు భావిస్తున్నారు. మొన్నటి మేయర్ అవిశ్వాసం ఓటింగ్లో కూడా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా పరిస్థితి ఏర్పడింది. డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం అవిశ్వాసం వీగిపోతుందని కూటమి పార్టీల్లోని కార్పొరేటర్లే అంతర్గతంగా చర్చించుకుంటుండడం గమనార్హం.
తమకంటే తమకు కావాలంటూ...!
మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో బహిరంగంగా అభ్యర్థిని ప్రకటించకపోయినప్పటికీ, అవిశ్వాసం సమయానికి స్పష్టత ఉంది. మేయర్ పోటీలో పీలా శ్రీనివాసరావు బరిలో ఉన్నట్లు కార్పొరేటర్లతో పాటు కూటమి పార్టీల్లోని నేతలకూ సమాచారం ఉంది. అయితే, డిప్యూటీ మేయర్ విషయంలో మాత్రం ఈ స్పష్టత ఎక్కడా లేదు. డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీలో చీలికలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి ఇచ్చిన నేపథ్యంలో పొత్తు ధర్మంలో భాగంగా డిప్యూటీ మేయర్ తమకు కావాలంటూ జనసేన పార్టీ కోరుకుంటోంది. డిప్యూటీ మేయర్ పదవి తమకే ఇస్తారని ఆ పార్టీ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ కార్పొరేటర్ల సమావేశంలో చెప్పారు. అయితే, అదే సమయంలో ఆ పార్టీ నుంచి ఆరుగురు ఆశావహులున్నారు. జనసేన నుంచి కందుల నాగరాజు, ఉష శ్రీ, హేమలత, భీశెట్టి వసంతలక్ష్మి, వంశీరెడ్డి, సాధిక్లు పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి ఇస్తారనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఎవరికివారుగా తమదే సీటు అని ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీలో కూడా డిప్యూటీ మేయర్ పోస్టు కోసం పోటీ ఉంది. పల్లా శ్రీను, గంధం శ్రీనులు ఆశిస్తున్నారు.
అభ్యర్థి తెలియక కూటమి పార్టీలో తికమక
తమకేనంటూ జనసేన ప్రచారం
తమకూ కావాల్సిందేనంటున్న టీడీపీలోని మరో వర్గం
నేడు డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం
జనసేనలో కూడా చీలిక
జనసేన పార్టీలో కూడా డిప్యూటీ మేయర్ పదవి ఆశిస్తున్న వారిలో రెండు వర్గాలుగా విడిపోయినట్టు తెలుస్తోంది. మొదటి నుంచీ పార్టీలో ఉండి..కార్పొరేటర్గా పార్టీ గుర్తుపై గెలిచిన వారికే ప్రాధాన్యత ఉండాలనే వాదన ఉంది. ఈ వాదనను జనసేన ఫ్లోర్ లీడర్తో పాటు నిత్యం వార్తల్లో ఉండే మరో కార్పొరేటర్ తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. అయితే మొదటి నుంచీ పార్టీలో లేరనే వాదనతో తమను పట్టించుకోకపోవడం సరికాదని ఉష శ్రీ, సాధిక్, కందుల నాగరాజు తదితరులు వాదనకు దిగుతున్నారు. డిప్యూటీ మేయర్గా మహిళలకే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్తో పాటు ఉష శ్రీ కూడా మరో వాదన వినిపించడం ప్రారంభించారు. దీంతో అభ్యర్థిత్వం విషయంలో ఆ పార్టీ కూడా తేల్చుకోలేకపోతోంది. ఇక సందులో సడేమియా అన్నట్టుగా స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచిన విల్లూరి భాస్కరరావు కూడా డిప్యూటీ మేయర్ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేత, ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్ ద్వారా ఆయన పావులు కదుపుతున్నట్టు సమాచారం. మొత్తంగా డిప్యూటీ మేయర్పై అవిశ్వాసం విషయంలో కూటమి పార్టీలో నెలకొన్న విభేదాలు ఓటింగు విషయంలో స్పష్టంగా బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తోంది. తద్వారా వైఎస్సార్ సీపీ ఖాతాలోనే డిప్యూటీ మేయర్ పదవి ఉంటుందని కూడా అంతే బలంగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.