
వీధి దీపాలు కూడా వెలిగించలేకపోతున్నాం
● డీఆర్సీలో టీడీపీ ఎమ్మెల్యేల పెదవి విరుపు ● ప్రజాసంక్షేమంపై దృష్టిపెట్టాలన్న శాసనమండలి విపక్ష నేత బొత్స ● పారిశుధ్య పోస్టుల్ని ఎప్పుడు భర్తీ చేస్తారన్న ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం : ‘‘ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదవుతోంది. అయినా.. నగరంలో వీధి దీపాలను కూడా సరిగ్గా వెలిగించలేకపోతున్నాం. ఎటు చూసినా రాత్రి పూట అంధకారంగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోకపోతే ఎలా.?’’
జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశం (డీఆర్సీ)లో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలివి.
దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు వీధిదీపాల సమస్యలు, పారిశుద్ధ్యలోపంపై ఫిర్యాదులు చేశారు. నగరం అధ్వానంగా మారిందనే రీతిలో జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలా వీరాంజనేయ స్వామి దృష్టికి సమస్యలు తీసుకెళ్లారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీఆర్సీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఇన్చార్జి మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, కలెక్టర్ హరేందిర ప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత ఇటీవల ఉగ్రవాద కాల్పుల్లో మృతి చెందిన చంద్రమౌళి, మధుసూధన్కు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. అనంతరం జరిగిన సమీక్షలో నియోజకవర్గాల వారీగా.. ఎమ్మెల్యేలు సమస్యలను ఇన్చార్జి మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టే మాస్టర్ ప్లాన్ రోడ్లను, ఇతర ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని ఇన్చార్జి మంత్రి ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. సదరం స్లాట్ల విషయంలో వెసులుబాటు కల్పించాలని, ప్రజలకు సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో స్లాట్ ఇవ్వాలన్నారు. మేఘాద్రి గెడ్డ, గంభీరం రిజర్వాయర్ల నిర్వహణపై సమీక్షించిన ఆయన ప్రభుత్వ నిర్దేశాల మేరకు తుది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీధిదీపాల నిర్వహణపై ఆడిట్ చేయించి యుద్ధప్రాతిపదికన వేయించాలని అధికారులను ఆదేశించారు. 100 గజాల లోపు స్థలంలో ఇళ్లు కట్టుకునే వారికి సెల్ఫ్ సర్టిఫికేషన్ విషయంలో అడ్డంకులు సృషించకుండా అవగాహన కల్పించాలన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి సారించి.. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచెయ్యాలని మండలి విపక్ష నేత బొత్స సూచించారు. ఇటీవల 60 ఏళ్లు దాటిన జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందిని తొలగించిన ప్రభుత్వం.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడం వల్ల నగరంలో శానిటేషన్ మరుగున పడిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం 500 మంది సిబ్బంది ఖాళీలున్నాయనీ.. కాంట్రాక్టు వర్కర్లతో ప్రస్తుతానికి పనిచేయిస్తున్నామని అధికారులు తెలిపారు.
జీవీఎంసీ జోన్ల పునర్వ్యవస్థీకరణపై చర్చ
పరిపాలన సౌలభ్యం కోసం జీవీఎంసీ జోన్ల పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్, జీవీఎంసీ ఇన్చార్జ్ కమిషనర్ హరేందిర ప్రసాద్ ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న జోన్లని ఆయా నియోజకవర్గాలకు అనుగుణంగా సరిహద్దులు మార్పులు చేపడతామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో జోన్గా రూపాంతరం చెందనున్నట్లు తెలిపారు.
రెండు సెంట్లు ఇస్తాం..
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఇన్చార్జి మంత్రి బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే.. అప్పుడు తీసుకున్న ఒక సెంటు ఇంటి స్థలం వద్దనుకునేవారికి రెండు సెంట్లు స్థలం ఇస్తామని వ్యాఖ్యానించారు. సెంటు భూమి వద్దనకునేవారి జాబితాల్ని సేకరించేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తామని తెలిపారు. ఆంఽధ్ర విశ్వవిద్యాలయంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కొనసాగుతుందని మంత్రి వెల్లడించారు.
‘సాక్షి’పై మంత్రి చిందులు
కూటమి ప్రభుత్వం చేస్తున్న అడ్డగోలు పనులపై ప్రశ్నించినందుకు టీడీపీ ప్రజా ప్రతినిధులు చిందులేశారు. డీఆర్సీ సమావేశం అనంతరం మీడియాతో ఇన్చార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామితో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సమయంలో ఊరు పేరు లేని ఉర్సా కంపెనీ, టీసీఎస్ కి 99 పైసలకు భూకేటాయింపులపై ‘సాక్షి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఏ కంపెనీకై నా ఇలాగే భూములు కేటాయిస్తారా అని ప్రశ్నించగా.. ఎమ్మెల్యే వెలగపూడి, ఇతర ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తోంది సాక్షి ప్రతినిధులని మంత్రికి చెప్పారు. దీంతో మంత్రి ఒక్కసారిగా పూనకం వచ్చినట్లు మాట్లాడారు. కంపెనీ ప్రొఫైల్ చూసే భూములిచ్చామని, ప్రశ్నించడానికి మీరెవరంటూ చిర్రుబుర్రులాడారు. వెంటనే వెలగపూడి అందుకొని సాక్షిని ఎందుకు మీటింగులకి పిలుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.