
సీఎం కాన్వాయ్ కోసం.. షాపుల తొలగింపు
సింహగిరిపై వర్తకులకు హుకుం జారీ చేసిన అధికారులు
సింహాచలం: చందనోత్సవం సమీపిస్తుండటంతో సింహాచలం దేవస్థానం అధికారులు హడావుడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా కాన్వాయ్ కోసం స్థలం సిద్ధం చేయాలంటూ ఉన్నట్టుండి దుకాణాలు ఖాళీ చేయాలని ఆదేశించడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరతరాలుగా సింహగిరిని నమ్ముకుని వ్యాపారం చేసుకుంటున్న వీరు, చేసేది లేక అసంపూర్తిగా ఉన్న నూతన షాపింగ్ కాంప్లెక్స్లోకి సామాన్లు తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే, సింహాచలం దివ్యక్షేత్ర అభివృద్ధి పనుల్లో భాగంగా 2008లో కొండపై బస్టాండ్ వద్ద రేకులతో తాత్కాలిక దుకాణాలు నిర్మించి వ్యాపారులకు కేటాయించారు. ప్రసాద్ స్కీమ్ కింద నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడంతో, 2023 డిసెంబర్లో వ్యాపారులను ఖాళీ చేయించి పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల సముదాయంలో తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేశారు. 2024 చందనోత్సవం నాటికి కొత్త షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేస్తామని చెప్పడంతో వ్యాపారులు అక్కడికి వెళ్లారు. అయితే, ఇప్పటికీ నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి కాలేదు.
ఇలా ఉండగా, రెండు రోజుల క్రితం దేవస్థానం అధికారులు హఠాత్తుగా తాత్కాలిక షాపింగ్ కాంప్లెక్స్ను ఖాళీ చేసి కొత్త కాంప్లెక్స్లోకి వెళ్లాలని ఆదేశించారు. చందనోత్సవానికి సీఎం వస్తున్నారని, ఆయన కాన్వాయ్ కోసం స్థలం కావాలని ఒకసారి, పార్కింగ్ స్థలం అవసరమని మరోసారి చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందారు. కొత్త షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకా విద్యుత్ సరఫరా లేదని, ఎక్కడపడితే అక్కడ రాళ్లు,రప్పలు ఉన్నాయని, ఉన్నట్టుండి ఎలా వెళ్లాలని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ నెల 26, 27 తేదీల్లో గంధం అమావాస్య పర్వదినాల కారణంగా భక్తులు ఎక్కువగా వస్తారని, అప్పుడు షాపులు మారిస్తే నష్టం వాటిల్లుతుందని వారు వాపోయారు. అయినా సరే దుకాణాలు ఖాళీ చేయాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేది లేక వ్యాపారులు శుక్రవారం నుంచి తమ సామాన్లను కొత్త కాంప్లెక్స్లోకి తరలిస్తున్నారు. 2024 చందనోత్సవం సమయంలో పాదాలమ్మ–బంగారమ్మ ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక షాపులు ఉండటంతో అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.