నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్‌ విజయం | - | Sakshi
Sakshi News home page

నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్‌ విజయం

Apr 26 2025 1:21 AM | Updated on Apr 26 2025 1:21 AM

నాటి

నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్‌ విజయం

● నడుపూరు ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు ● 500+ మార్కులతో మెరిసిన 49 మంది విద్యార్థులు ● విద్యార్థులను కార్లలో ఊరేగించిన టీచర్లు

వసతులతో పెరిగిన ఆసక్తి

నాడు–నేడుతో పాటు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం నిర్వహించిన ఆరోగ్య శిబిరాలు వంటి పథకాలు పేద విద్యార్థులను బడికి దగ్గర చేశాయి. ముఖ్యంగా ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులను సిద్ధం చేసే లక్ష్యంతో డిజిటల్‌ విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. పాఠశాలలకు డిజిటల్‌ బోర్డులు, టీవీలు ఏర్పాటు చేసి అద్భుతమైన కంటెంట్‌ను రూపొందించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద కూడా ఆయా సబ్జెక్టులను రివిజన్‌ చేసుకునేందుకు వీలుగా 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. ఈ పథకాలన్నీ విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచి.. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి.

పెదగంట్యాడ: నడుపూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో సంచలన ఫలితాలు సాధించి, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా నిలిచారు. ఈ ఏడాది ఏకంగా 49 మంది విద్యార్థులు 600 మార్కులకు గాను 500కు పైగా మార్కులు సాధించడం విశేషం. ఈ నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయులు వినూత్నంగా సంబరాలు చేసుకున్నారు. ఈ అద్భుత విజయానికి ప్రధాన కారణం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యం, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలే అని చెప్పడంలో సందేహం లేదు.

నాడు–నేడుతో మారిన రూపురేఖలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘నాడు–నేడు’పథకం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చి వేసింది. నడుపూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.1.86 కోట్లు కేటాయించి, పాఠశాల భవనాలకు జీవం పోసింది. తరగతి గదులు ఆధునికీకరణ, డిజిటల్‌ బోర్డులు, టీవీల ఏర్పాటు, సురక్షితమైన టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్‌, ఫ్లోరింగ్‌, మెరుగైన వాతావరణం కోసం మొక్కల పెంపకం వంటి మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇలా ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించింది. అయితే.. ప్రభుత్వం మారిన తర్వాత 8 తరగతి గదుల నిర్మాణం నిధుల్లేక అసంపూర్తిగా మిగిలిపోవడం గమనార్హం.

ప్రోత్సాహం, పట్టుదలతో ఫలితాలు

ప్రభుత్వం కల్పించిన ఈ అద్భుతమైన మౌలిక వసతులు, ప్రోత్సాహకాలకు తోడు పాఠశాల ఉపాధ్యాయుల అంకితభావం, కృషి కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, వారి సందేహాలను నివృత్తి చేయడం, పరీక్షల భయాన్ని పోగొట్టి వారిని సన్నద్ధం చేయడంలో ఉపాధ్యాయులు సఫలీకృతులయ్యారు.

ప్రజల్లోకి విజయం

ఈ విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచేందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థులను కార్లలో ఊరేగించారు. విద్యార్థులు సాధించిన మార్కులను ప్లకార్డుల ద్వారా ప్రదర్శిస్తూ.. ప్రైవేటుకు స్వస్తి పలికి సర్కార్‌ బడుల్లో చేర్పించాలంటూ విస్తృత ప్రచారం చేశారు. అలాగే ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులకు హెచ్‌ఎం రాచకొండ శ్రీనివాస్‌ శుక్రవారం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసి అభినందించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయంతో గర్వంగా ఉందన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదివిస్తున్న పిల్లలను సైతం ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో కలసి ఆరు బృందాలను ఏర్పాటు చేశామని, నాలుగు రోజుల పాటు మండలంలోని ఇంటింటికీ వెళ్లి పిల్లలను తమ బడిలో చేర్పించాలని కోరుతున్నట్లు వివరించారు.

10వ తరగతిలో 584, 580 మార్కులు సాధించిన విద్యార్థులను ఊరేగిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు

నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్‌ విజయం1
1/1

నాటి సంస్కరణల ఫలితం.. ‘పది’లో రికార్డ్‌ విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement