
రద్దీ ప్రాంతాల్లో కాపు కాసి.. బైక్ల చోరీ
ఎంవీపీకాలనీ: నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న కోట శివ అనే పాత నేరస్తుడిని ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతను పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలం, కోట సీతారామపురం గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. క్రైం ఏడీసీపీ మోహనరావు తెలిపిన వివరాలివి.. మార్చి 17న పెదవాల్తేర్ రిలయన్స్ మార్ట్ ఎదుట దాసరి శంకరరావు అనే వ్యక్తి హోండా యాక్టీవా దొంగతనానికి గురైంది. మార్ట్ ఎదుట వాహనాన్ని పార్క్ చేసిన శంకరావు పక్కనే ఉన్న చికెన్ షాపుకు వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. దీనిపై ఎంవీపీ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావు నేతృత్వంలో పోలీసులు మార్ట్ సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుడిని గుర్తించారు. అతను చివరిగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించి.. సెల్ఫోన్ నంబర్ను కనుగొన్నా రు. ఆ సెల్ఫోన్ ఆధారంగా నిందితుడు కోట శివగా నిర్ధారించారు. ఈ నెల 24న అతన్ని అదుపులోకి తీసు కుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. నిందితుడు కోట శివ ముఖ్యంగా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసేవాడు. ఏమరపాటుగా ఎవరైనా తమ బైక్కు తాళాలు వదిలి వెళితే.. వెంటనే బైక్ను దొంగిలించేవాడు. విచారణలో శివ ఎంవీపీ కాలనీ, వన్టౌన్, టూటౌన్, త్రీటౌన్, ద్వారకా పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 17 ద్విచక్ర వాహనాలను దొంగలించినట్లు అంగీకరించాడు. అతను 2024 నుంచి నగరంలో వాహనాలు చోరీ చేస్తున్నట్లు తేలింది. శివపై గతంలో 31 కేసులు ఉన్నాయని, జీఆర్పీలో సస్పెక్ట్ షీట్ కూడా ఉందని పోలీసులు గుర్తించారు. అతని నుంచి సేకరించిన సమాచారంతో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ విధించింది. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ద్వారకా క్రైం సీఐ చక్రధర్రావుతో పాటు ఎస్ఐ అప్పలరాజు, ఏఎస్ఐ కిశోర్బాబు, పీసీలు జగత్ కిరణ్, హరిప్రసాద్, సాయి, అప్పలరాజు, అగస్టీన్లను ఉన్నతాధికారులు అభినందించారు. సమావేశంలో ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
17 వాహనాలు స్వాధీనం