
ట్రైబల్ ఆర్చరీ పోటీలు ప్రారంభం
కొమ్మాది: బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని జన జాతీయ గౌరవ్ వర్ష్ కార్యక్రమంలో భాగంగా జన జాతీయ ఖేల్ మహోత్సవ్– ట్రైబల్ ఆర్చరీ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. గీతం కళాశాల ప్రాంగణంలో శుక్రవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ క్రీడోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన యువత తమ సంప్రదాయ విలువలు, నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇటువంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యా రంగంలోనూ గిరిజన విద్యార్థులు ముందంజలో ఉన్నారని, ఇటీవల విడుదలైన 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల కోసం విలువిద్య(ఆర్చరీ) పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నివసిస్తున్న 27.39 లక్షల గిరిజనుల సమగ్ర సామాజిక, ఆర్థిక, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గిరిజన కళా ప్రదర్శనలు, నృత్యోత్సవాలు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, గిరిజన పండుగలను విశాఖ, విజయవాడ, ఐటీడీఏ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఆర్చరీ పోటీలకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, అండమాన్ నికోబార్ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. టీసీఆర్టీఎం ఈడీ రాణిమందా సిబ్బంది పాల్గొన్నారు.