
ఏయూకి శతాబ్ది ఉత్సవ శోభ
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కాను న్నాయి. ఏడాదిపాటు జరిగే ఈ వేడుకల ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ కోర్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం వద్ద కలెక్టర్ హరేందిర ప్రసాద్ వాకథాన్ను ప్రారంభిస్తారు. అనంతరం సిరిపురం, స్నాతకోత్సవ మందిరం, పరిపాలన భవనం వద్ద ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేక బెలూన్ను ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైన తర్వాత ఏయూ విజన్ డాక్యుమెంట్, లోగో ఆవిష్కరణ, ప్రత్యేక నృత్య రూపకం ప్రదర్శిస్తారు. అనంతరం పూ ర్వ విద్యార్థుల సంఘం చైర్మన్, వీసీ, అతిథుల ప్రసంగాలు ఉంటాయి. సాయంత్రం 6.30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు పాల్గొంటారు. వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఏడాది పొడవునా అకడమిక్, ఔట్రీచ్, మెగా ఈవెంట్లు నిర్వహిస్తామని, 2026 ఏప్రిల్ 26న ముగింపు వేడుకలు ఘనంగా ఉంటాయని తెలిపారు. మెగా ఈవెంట్లను విభిన్న విభాగాలు సమన్వయంతో నిర్వహించాలని, ప్రముఖు లను ఆహ్వానించాలని సూచించారు. రెక్టర్ ఆచార్య ఎన్. కిశోర్ బాబు, ప్రిన్సిపల్స్ కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాట్లను వీసీ స్వయంగా పరిశీలించారు.
నేటి నుంచి శతాబ్ది సంవత్సరం ప్రారంభం
ఏడాది పొడవునా కార్యక్రమాలు