
దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
బీచ్రోడ్డు: దివ్యాంగులు తమలోని ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభు త్వం కృషి చేస్తోందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఐడీబీఐ సామాజిక బాధ్యత నిధులతో అలీంకో సంస్థ తయారు చేసిన రూ. 49.01 లక్షల విలువైన 380 అత్యాధునిక ఉపకరణాలను శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 241 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల శారీరక, మానసిక దృఢత్వం కోసం రూ. 200 కోట్లతో 25 ఎకరాల్లో అత్యాధునిక పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రీజినల్ సెంటర్ ఏర్పాటుకు కలెక్టర్ సహకారంతో స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. గత డిసెంబర్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో దివ్యాంగుల అవసరాలు గుర్తించి ఈ ఉపకరణాలు ఎంపిక చేశామన్నారు. పంపిణీ చేసిన వాటిలో బ్యాటరీతో నడిచే మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, సాధారణ ట్రైసైకిళ్లు, వాకింగ్ స్టిక్స్, కమోడ్తో కూడిన వీల్ చైర్లు, ఫోల్డింగ్ వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు, జాయ్స్టిక్ వీల్ చైర్లు, కర్రలు, కాలిపర్స్, రోలేటర్ వంటి 380 రకాల ఉపకరణాలు ఉన్నాయని పేర్కొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ హరేందిర ప్రసాద్ దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణు కుమార్ రాజు, ఐడీబీఐ జనరల్ మేనేజర్ కన్వాడెబ్ దాస్, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ మాధవి, దివ్యాంగులు పాల్గొన్నారు.
రూ. 49 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ
జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి