ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకతా? | - | Sakshi
Sakshi News home page

ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకతా?

Apr 25 2025 1:07 AM | Updated on Apr 25 2025 1:07 AM

ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకతా?

ఏడాదిలోపే ఇంతటి వ్యతిరేకతా?

● వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీదే అధికారం ● 11 నెలల మేయర్‌ పదవీ కాలం కోసం కూటమి కుట్రలు ● 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇటువంటి రాజకీయాలు చూడలేదు ● ఎన్ని ప్రలోభాలు పెట్టినా నిబద్ధతతో ఉన్న కార్పొరేటర్లకు అభినందన ● డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని బహిష్కరిస్తున్నాం.. ● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది తిరగక ముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌ సీపీయే అని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్ర దాడిని రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. వారి కుటుంబాలకు ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు.

గెలుపోటములు సహజం

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని ఆయన పేర్కొన్నారు. విశాఖ మేయర్‌ పీఠం కోసం కూటమి నేతలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 11 నెలల అధికారం కోసం కూటమి నేతలు అవిశ్వాసం పెట్టి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, లొంగకపోతే ఆర్థిక మూలలను దెబ్బతీస్తామని బెదిరించారని వెల్లడించారు. తమ కార్పొరేటర్ల కోసం రూ.25 లక్షలు ఖర్చు చేసి ప్రత్యేక విమానంలో కేరళకు వెళ్లడం పరాకాష్ట అన్నారు. కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ఎన్ని ఇబ్బందులు, ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ సభ్యులు పార్టీలోనే ఉన్నారని వారిని అభినందించారు. ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమే అని, ఇది ఒక గుణపాఠంగా తీసుకొని అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. రాబోయే విజయానికి ఇదే పునాదిరాయిగా అభివర్ణించారు. ఈ 11 నెలల కాలంలో కూటమి కార్పొరేటర్లు నగరాభివృద్ధి ఎలా చేస్తారో ప్రజలు గమనిస్తారని తెలిపారు. ఇదే విధంగా ఈ నెల 26న జరగనున్న డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇది మంచి సంప్రదాయం కాదు

కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో జరిగిన దాడులు, ఘటనలను ఆయన ఖండించారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పాలన, ప్రవర్తన చూడలేదని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నేతలపైనే కాకుండా వారి ఆస్తులు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం మంచి సంప్రదాయం కాదని హితవు పలికారు. తానెప్పుడూ ఇటువంటి రాజకీయాలు చూడలేదు, చేయలేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్‌కుమార్‌, మళ్ల విజయ్‌ప్రసాద్‌, తిప్పల దేవన్‌రెడ్డి, మలసాల భరత్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తైనాల విజయ్‌కుమార్‌, చింతలపూడి వెంకట్రామయ్య, మాజీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, ఫ్లోర్‌ లీడర్లు, కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement