
చందనోత్సవం టికెట్ల విక్రయాలు ప్రారంభం
● ఒక ఆధార్పై 4 టికెట్లు మాత్రమే జారీ ● 30న ఉదయం 5 గంటలలోపే ప్రొటోకాల్ వీఐపీల దర్శనాలు పూర్తి
సింహాచలం: సింహగిరిపై చందనోత్సవం టిక్కెట్ల విక్రయాలు గురువారం ప్రారంభమయ్యాయి. పాత పీఆర్వో కార్యాలయంలో ఉదయం 7 నుంచి రూ.300, రూ.వెయ్యి టికెట్ల విక్రయాలను ప్రారంభించి, దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు చేతుల మీదుగా భక్తులకు అందించారు. ఒక ఆధార్ నెంబరుతో నాలుగు టిక్కెట్లు మాత్రమే జారీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఈవో మాట్లాడుతూ రూ.300, రూ.వెయ్యి టికెట్లను ఉదయం 3.30 నుంచి రాత్రి 7 వరకు పలు టైం స్లాట్లుగా విభజించి జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 30న తెల్లవారుజాము 3 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త అశోక్గజపతిరాజు తొలిదర్శనం కాగానే, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఉదయం 5లోపు ప్రొటోకాల్ వీఐపీల దర్శనాలు పూర్తిచేస్తామన్నారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చిన వారికి నీలాద్రిగుమ్మం వద్ద నుంచే దర్శనం ఉంటుందన్నారు. ప్రొటోకాల్ వీఐపీలను రెండు కేటగిరీలుగా విభజించినట్లు పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్, సీఎం, మంత్రులు, సుంప్రీకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఉచితంగానే దర్శనం కల్పిస్తామన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రూ.1500 ప్రొటోకాల్ టిక్కెట్లు తీసుకోవాల్సిందేనని, వారితో పాటు ఆరుగురికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఈ టికెట్లను ఎవరెవరికి జారీ చేయాలో జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఈసారి నీలాద్రి గుమ్మం వద్ద ఆరు క్యూ లైన్లలోనే భక్తులు వెళ్లి స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.