
చర్చిలో బాలిక అనుమానాస్పద మృతి?
కంచరపాలెం: జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ చర్చిలో గురువారం సాయంత్రం 11 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. విజయనగరానికి చెందిన ఈదల పూర్ణచంద్రిక(11)కు ఎవరో చేతబడి చేశారని.. బాలిక తల్లి వరలక్ష్మి, అమ్మమ్మ సావిత్రి చర్చిల చుట్టూ తిప్పుతున్నారు. గురువారం సాయంత్రం జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్స్ చర్చికి బాలికను తీసుకొచ్చారు. ప్రార్థనలు చేసిన సమయంలో తల చుట్టూ చున్ని కప్పి నోట్లో గుడ్డలు కుక్కినట్లు తెలుస్తోంది. ఊపిరాడక బాలిక చర్చిలోనే ప్రాణం వదిలినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకంతో తల్లి, అమ్మమ్మ ఈ విధంగా చేశారని స్థానికులు చెబుతున్నారు. చర్చి ప్రతినిధులు, స్థానికుల సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలిక తల్లి, అమ్మమ్మను విచారిస్తున్నారు.