
కేజీహెచ్ సూపరింటెండెంట్ ఆదేశం
రొటేషన్ పద్ధతిలో నైట్ డ్యూటీలు
డాబాగార్డెన్స్: నర్సింగ్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ఆదేశించారు. ‘కొందరికే నైట్ డ్యూటీ ఎందుకు?’ శీర్షికతో ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులతో గురువారం సూపరింటెండెంట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, నైట్ డ్యూటీలను రొటేషన్ పద్ధతిలో చేసుకోవాలని సూచించారు. ఇటీవల కేజీహెచ్ను సందర్శించిన అదనపు డీఎంఈ కూ డా ఈ విషయమై పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. వార్డుల్లో ఏ సమస్య తలెత్తినా దానికి హెడ్ నర్సులదే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతి బ్లాక్కు తప్పనిసరిగా ఒక హెడ్ నర్సు ఉండాలని డీఎంఈ సూచించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.