బినామీల చేతుల్లోకి భృతి? | - | Sakshi
Sakshi News home page

బినామీల చేతుల్లోకి భృతి?

Apr 25 2025 1:07 AM | Updated on Apr 25 2025 1:07 AM

బినామీల చేతుల్లోకి భృతి?

బినామీల చేతుల్లోకి భృతి?

● మత్స్యకార నిషేధ భృతి జాబితాలో అక్రమాలు! ● వాస్తవం కన్నా ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు ● ఈ దందా వెనుక ఓ యూనియన్‌ నాయకుడు?

డాబాగార్డెన్స్‌: వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇవ్వాల్సిన నిషేధ భృతిని గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఇప్పటికే వేట నిషేధం అమల్లోకి రాగా.. నిషేధ భృతిని ఈ నెల 26న అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మత్స్యకారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ భృతి పంపిణీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని.. కొందరు అనర్హుల పేర్లను జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కొందరు యూనియన్‌ నాయకులు అర్హులైన వారి పేర్లు తప్పించి.. వారికి అనుకూలంగా ఉన్న మత్స్యకారుల పేర్లు చేర్చినట్లు సమాచారం.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సుమారు 600 మర పడవలు, 300 తెప్పలు ఉన్నాయి. ఒక్కో మర పడవలో ఏడుగురు మత్స్యకారులు, ఒక్కో తెప్పకు నలుగురు మత్స్యకారులు ఉంటారు. అయితే అసలు మత్స్యకారుల సంఖ్యను పెంచి చూపుతున్నారని తెలుస్తోంది. ఉదాహరణకు ఏడుగురు సిబ్బంది ఉన్న మరపడవల్లో తొమ్మిది మంది ఉన్నట్లుగా ఓ యూనియన్‌ నాయకుడు లెక్కలు చూపి.. అదనంగా ఇద్దరు పేర్లు చేర్చినట్లు భోగట్టా. ఈ విధంగా 600 మర పడవలకు, 300 తెప్పలకు బినామీ పేర్లను చేర్చి.. లబ్ధిదారుల సంఖ్యను వాస్తవం కన్నా ఎక్కువగా చూపుతున్నట్లు తెలుస్తోంది.

‘నీకు సగం.. నాకు సగం’

ఓ మత్స్యకార సంఘం నాయకుడు ఈ దందా వెనుక ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అనర్హులైన వారి పేర్లు చేర్చి, వారికి వచ్చే భృతిలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారని, ఈ తతంగం ద్వారా సుమారు రూ.కోట్ల అక్రమాలకు పాల్పడేందుకు స్కెచ్‌ వేశాడని కొందరు మత్స్యకారులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ‘నీకు సగం... నాకు సగం’పద్ధతిలో అర్హులైన మత్స్యకారులకు రావాల్సిన భృతి.. అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా.. ఫిషింగ్‌ హార్బర్‌లో నమోదైన 600 మర పడవల్లో చాలా కాలంగా మూలనపడిన లేదా మరమ్మతులకు గురైన సుమారు 110కి పైగా పడవలు ఉన్నట్లు సమాచారం. అయితే విశాఖ పోర్టుకు జెట్టీ ఫీజు చెల్లిస్తూ.. ఈ బోట్ల కూడా వేటకు వెళ్తున్నట్లుగా పత్రాల్లో చూపినట్లు సమాచారం. వీటిల్లో పనిచేస్తున్నట్లుగా మత్స్యకారుల పేర్లను జాబితాలో చేర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

అర్హులుగానీ అనర్హులు

మరో ప్రధాన సమస్య ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ల కిందట కొంతమంది మత్స్యకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసింది. ఆ తర్వాత మత్స్యకారులుగా మారిన ఎంతో మందికి ఇప్పటివరకు గుర్తింపు కార్డులు అందలేదు. దీంతో అర్హులైనప్పటికీ గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వారు మత్స్యకార భరోసా పథకానికి అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఒకపక్క బినామీలు జాబితాలో చేరుతుంటే.. మరోపక్క అర్హులు గుర్తింపు కార్డులు లేక లబ్ధి పొందలేకపోవడంపై మత్స్యకార వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి.. అర్హులైన ప్రతి మత్స్యకారుడికీ భృతి అందేలా చూడాలని వారు కోరుతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు

అల్లిపురం: వేట నిషేధ భృతి జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పెదజాలారిపేటకు చెందిన సూరాడ సోమేశ్వరరావు కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ లంచాలు తీసుకుంటూ.. అర్హులైన మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బోట్లు, లైసెన్స్‌లు కలిగి ఉన్న అర్హులైన మత్స్యకారులను నమోదు చేయకుండా.. బినామీల పేరిట పాడైన బోట్లు కొని, వాటికి నకిలీ లైసెన్స్‌లు సృష్టించిన వారిని నమోదు చేస్తున్నారని ఆరోపించారు. తమ రెండు బోట్లు రన్నింగ్‌లో ఉన్నప్పటికీ.. జాబితాలో నమోదు చేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని వాపోయారు. చేతకాకపోతే బోట్లు అమ్మేయండి అంటూ అధికారులు సలహాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కలెక్టర్‌ జోక్యం చేసుకుని అధికారులను పిలిపించి మాట్లాడినా.. ఆ అధికారుల తీరు మారలేదన్నారు. పైగా తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారంతో పేర్ల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తి కానున్న నేపథ్యంలో.. అర్హులైన మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement