
నగరంలో నేరాలు తగ్గాలి
విశాఖ సిటీ: విశాఖలో క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టేలా రాత్రి పూట నిఘా మరింత పటిష్టం చేయాలని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో పోలీస్ ఉన్నతాదికారులతో కలిసి ఏడీసీపీల నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో యాక్టివ్గా ఉన్న రౌడీషీటర్లు, వారిపై పెడుతున్న నిఘాపై ఆరా తీశారు. పోలీస్స్టేషన్లలో పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పూర్తిగా నివారించాలని సూచించారు. ఆయా స్టేషన్ల పరిధిలో నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలిస్తూ విజిబుల్ పోలీసింగ్, పికెట్లు, అవసరం మేరకు డికాయ్ టీమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నగరంలో గంజాయి ఎక్కడా ఉండకూడదని, ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటివి ఏ స్టేషన్ పరిధిలోనూ చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అదనంగా వెహికల్, మెన్ ఇతర అవసరాలు ఉంటే తనకు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కొత్త సాఫ్ట్వేర్లు తీసుకొని నేరాల నియంత్రణకు వినియోగించాలని చెప్పారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై వేధింపులు, మిస్సింగ్ సంబంధిత కేసుల్లో జాప్యం లేకుండా దర్యాప్తు చేపట్టాలని చెప్పారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పూర్తి పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని, విధుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినా తక్షణమే వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీ–2 డి.మేరీప్రశాంతి, డీసీపీ(అడ్మిన్) కృష్ణ కాంత్ పటేల్, డీసీపీ(క్రైమ్స్) కె.లతామాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలి
మహిళల భద్రతకు ప్రాధాన్యం
నేర సమీక్ష సమావేశంలో సీపీ శంఖబ్రత బాగ్చి