
ఏయూలో వింత పోకడలు
● ఫీజు కట్టించుకొని పరీక్షలకు అనుమతించని వైనం ● వీసీ భవనం ముందు విద్యార్థులు ధర్నా
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు అవలంబిస్తున్న విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆరోపించారు. గురువారం రాత్రి వర్సిటీ వైస్ చాన్సలర్ భవనం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిగ్రీ రెండు, నాల్గో సెమిస్టర్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయి. వర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో సుమారు 30 మంది విద్యార్థులను గురువారం జరిగిన పరీక్షకు కాలేజీ నిర్వాహకులు అనుమతించలేదు. హాజరు శాతం సరిపోలేదనే కారణంతో పరీక్షలు రాయడానికి వీల్లేదని, హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తొలిరోజు పరీక్షను విద్యార్థులు కోల్పోయారు. అయితే హాజరు సరిపోకున్నా, కొంతమంది విద్యార్థులను తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పరీక్షలకు అనుమతించారని తెలుసుకున్న బాధిత విద్యార్థులు దీనిపై వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ సంఘాల నాయకులు విద్యార్థులతో చర్చించారు. విషయాన్ని కాలేజీ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోకపోవడంతో విద్యార్థులతో కలసి వైస్ చాన్సలర్ భవనం ముందు ధర్నా చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య శశిభూషణరావు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చించారు. ఫీజు చెల్లించినందున, తదుపరి పరీక్షలకు అనుమతించాలని కోరారు. తాము పరీక్షలను పూర్తిగా కోల్పోతే, అది ఉత్తీర్ణతపై ప్రభావం చూపుతుందన్నారు దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ ఆచార్య శశిభూషణరావు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు. ఆందోళనలో విద్యార్థి సంఘం నాయకులు అభిషేక్, సంజు, వికాస్, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.