
ఐకానికా సిటీ ప్రాజెక్టుకు భూమి పూజ
మధురవాడ: రుషికొండ సమీపంలో ఐకానికా గ్రాండ్, ఐకానికా క్యాపిటల్ ప్రీమియం, లగ్జరీ ప్రాజెక్టులు త్వరలో ఐకానికా సిటీ పేరుతో అందుబాటులోకి రానున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు గురువారం త్రిదండి చినజీయర్ స్వామి భూమి పూజ నిర్వహించారు. 97 ఎకరాల వీస్తీర్ణంలో వరల్డ్ క్లాస్ సదుపాయాలుతో దీనిని నిర్మాణం చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. ఐకానికి సిటీ అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో ఐకానికా సిటీ ఆఫ్ గోల్డ్ని నిర్మిస్తారని, ఇది పూర్తిగా అల్ట్రా లగ్జరీ విల్లాలతో అత్యంత ఆధునికంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామి మాట్లాడుతూ ఈ సిటీలోకి వచ్చిన వారికి కిరాణా దుకాణం నుంచి అన్ని రకాలు సదుపాయాలు ఉండాలన్నారు. యోగా ఇతర సదుపాయాలతో పాటు గుడి కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టు ప్రారంభమైందని, ఇప్పుడు తమ ఆధ్వర్యంలో భూమి పూజ కూడా జరగడం ఆనందించదగ్గ విషయమన్నారు. ఈ ప్రాజెక్టుకు తమ పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. ఇందులో యాజమాన్య ప్రతినిధులు, అతిథులు మురళీకృష్ణ, సంతోష్, తారక్, డాక్టర్ రాజేశ్వరరావు, వేణు వినోద్, అల్లూరి రంగరాజు, అల్లూరి సీతారామరాజు, కేఎల్ సంతోష్, శ్రీవర్ధన్, ఆధిత్య తదితరులు పాల్గొన్నారు.