
వార్డు అభివృద్ధి విస్మరించి ఆరోపణలా?
● మంకీ క్యాప్తో స్పాకు ఎందుకు వెళ్తున్నావ్? ● జనసేన కార్పొరేటర్పై డిప్యూటీ మేయర్ ఫైర్ ● ఒకే వార్డులో పోటీ చేద్దామా అని సవాల్
సీతమ్మధార: జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్పై డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని వార్డు అభివృద్ధిని విస్మరించి.. ఇతరులపై నిరాధార ఆరోపణలతో నిత్యం పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని హోటల్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూర్తి యాదవ్ ఉదయం రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు కుంభకోణాలు చేస్తున్నారని ఇతరులపై ఆరోపణలు చేసి.. సాయంత్రానికి స్టార్ హోటళ్లలో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని ఆరోపించారు. 2007లో తాను కార్పొరేటర్గా వెయ్యి ఓట్లతో గెలిచానని, తర్వాత వైఎస్సార్ సీపీలో చేరి మరలా కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినట్టు గుర్తు చేశారు. బికారిగా తిరుగుతున్న పీతల మూర్తిని యూత్ కాంగ్రెస్లో చేర్పించింది తానేనని గుర్తు చేస్తూ.. దమ్ముంటే వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ఒకే వార్డులో పోటీ చేద్దామా అని సవాల్ విసిరారు. స్పా, మసాజ్ సెంటర్లకు మంకీ క్యాప్ వేసుకొని ఎందుకు వెళ్తున్నావని మూర్తిని ప్రశ్నించారు. తన పాస్ పోర్ట్ సీజ్ అయ్యిందనే ప్రచారం అవాస్తవమని, తాను ఇటీవల అమెరికా వెళ్లి వచ్చానని తెలిపారు. త్వరలో తానా సభలకు వెళ్తున్నట్లు తెలిపారు. మూర్తి యాదవ్ ప్రభుత్వ మహిళా డాక్టర్ శాలరీ కార్డు జేబులో పెట్టుకు ని జల్సాలు చేస్తున్నాడని.. ప్రతి ప్రాంతంలో ఒక్కొక్క ఇంటిని మెయింటైన్ చేస్తున్నాడని ఆరోపించారు. ఎండాడలోని స్కై టవర్స్ బిల్డర్స్ని భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు దండుకోలేదా అని మూర్తిని ప్రశ్నించారు. వార్డులో ఒక మహిళ వద్ద 90 తులాల బంగారం, రూ.30 లక్షలను మూర్తి దోచుకున్నాడని కమిషనర్కు ఫిర్యాదు కూడా అందిందని శ్రీధర్ చెప్పారు. చిరు వ్యాపారులను ఇబ్బంది పెడుతున్న మూర్తికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఆనందపురం మండలం గిడిజాల సర్వే నం. 332/1 1.24 సెంట్లు, 332/2లో సుమారు 7.03 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేశాననే ఆరోపణలు నిరూపించాలని మూర్తియాదవ్కు సవాల్ విసిరారు. తాను ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు రుజువైతే.. ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చన్నారు. డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, వైఎస్సార్సీపీ నాయకులు గొలగాని శ్రీనివాస్, బానాల శ్రీనివాస్, ఒమ్మి చిన్నారావు, కోరుకొండ స్వాతి, శశికళ, మొల్లి అప్పారావు, మువ్వల సురేష్ పాల్గొన్నారు.
ఆరోపణలపై విచారణ చేయండి
గోపాలపట్నం: తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ బుధవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్ను కోరారు. కొద్ది రోజులుగా కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపై ఆరోపణలు చేస్తున్నాడని.. ప్రభుత్వ భూమిని తానెక్కడ కబ్జా చేశానో తేల్చాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తన, తన కుటుంబ సభ్యుల పేరుతో రెవెన్యూ స్థలాలు ఉన్నాయో సర్వే చేయించాలన్నారు. గ్రీన్ బెల్టులు ఆక్రమించినట్లు మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నాడని, అలాంటి వాటిపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

వార్డు అభివృద్ధి విస్మరించి ఆరోపణలా?