
మృత్యువులోనూ వీడని బంధం
● భర్త మరణించిన 15 నిమిషాలకే భార్య కన్నుమూత ● ఒకే పాడైపె అంతిమ యాత్ర.. ఒకే చితిపై దహనం ● రెడ్డిపల్లి పంచాయతీ రామన్నపేటలో విషాదం
పద్మనాభం: బంధం అంటే ఆ దంపతులదే. మృత్యువు కూడా వారిని విడదీయలేకపోయింది. భర్త ఈ లోకం విడిచి వెళ్లిన కొద్ది నిమిషాలకే భార్య కూడా ఆయన వెంటే పయనమైంది. పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీ రామన్నపేటలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. రామన్నపేటకు చెందిన సుంకర సత్యనారాయణ (78) కొంతకాలం కిందట పక్షవాతం బారినపడి కోలుకున్నారు. పది రోజులుగా తన పనులను తానే చేసుకుంటూ చురుగ్గా తిరుగుతున్నారు. అయితే మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సత్యనారాయణ అకస్మాత్తుగా మృతి చెందారు. భర్త మృతదేహం వద్ద భార్య రామయ్యమ్మ (73) గుండెలవిసేలా రోదించింది. ఆ దుఃఖంలోనే.. భర్త చనిపోయిన కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే రామయ్యమ్మ తుదిశ్వాస విడిచింది. జీవితాంతం అన్యోన్యంగా మెలిగిన ఆ వృద్ధ దంపతులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులను తామే చేసుకునేవారు. మృత్యువు కూడా వారిని విడదీయలేక ఒకే సారి ఇద్దరినీ తీసుకువెళ్లిపోవడం అందరినీ కంటతడి పెట్టించింది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. బుధవారం ఉదయం ఆ దంపతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇద్దరి మృతదేహాలకు పక్కపక్కనే కూర్చోబెట్టి స్నానం చేయించారు. అనంతరం ఒకే పాడైపె ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. రెడ్డిపల్లి కోమటి గుండం చెరువులోని శ్మశాన వాటికలో ఒకే చితిపై వారి దేహాలను పేర్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.

మృత్యువులోనూ వీడని బంధం

మృత్యువులోనూ వీడని బంధం