
స్కాముల్లో చంద్రబాబు దిట్ట
● లిక్కర్ స్కాం జరిగింది చంద్రబాబు పాలనలోనే..
● ఖజానాకు చేరాల్సిన రూ.5 వేల కోట్లు కూటమి నేతల జేబుల్లోకి..
● మద్యం కేసులో వైఎస్ జగన్ పేరు చేర్చే కుట్ర చేస్తున్నారు
● మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ
సాక్షి, విశాఖపట్నం: స్కామ్ల్లో చంద్రబాబు దిట్ట.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరిగింది కూటమి ప్రభుత్వంలోనేనని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 11 నెలల పాలనలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు వెలిశాయని మండిపడ్డారు. ఎంఆర్పీ కన్నా అధికంగా మద్యం దుకాణాల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారన్నారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో దొంగే దొంగ అన్నట్లు ఉందని, టీడీపీ నేతల కనుసన్నల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. నాణ్యమైన మద్యం అందిస్తామని నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారంటూ మండిపడ్డారు. నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి మద్యం పేరు చెప్పి ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రూ.5 వేల కోట్లు కూటమి నేతల జేబుల్లోకి వెళ్తున్నాయంటూ ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో వారి పార్టీ నాయకులకు అడ్డదారిలో డిస్టిలరీ అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన మద్యం అమ్మకాలు జరిగాయని, ప్రభుత్వ రంగంలో మద్యం షాపులు నిర్వహిస్తే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందే తప్ప, లంచాలు వస్తాయా.. అని ప్రశ్నించారు. ప్రైవేట్ రంగంలో మద్యం షాపులు నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వంలోనే లంచాలు వస్తాయన్నారు. తమ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక్క బెల్టు షాపు అయినా కనిపించిందా? అని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని, మద్యం కేసులో వైఎస్ జగన్ పేరు చేర్చే కుట్రకు ఈ కూటమి ప్రభుత్వ పాల్పడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా 2014–19 టీడీపీ పాలనలో చంద్రబాబు మీద ఉన్న మద్యం కేసులపైన విచారించే దమ్ముందా...? అంటూ పశ్నించారు.