
బహుళ నైపుణ్యాలు అవసరం
విశాఖ సిటీ: పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా యువత బహుళ నైపుణాలతో రాణించాల్సిన అవసరం ఉందని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్ పేర్కొన్నారు. ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని సాగరిక కన్వెన్షన్ సెంటర్లో బుధవారం ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పుస్తక జ్ఞానం ఒక్కటే సరిపోదన్నారు. ప్రతి శాస్త్రంతో సాంకేతికత, ఏఐ, ఎంఎల్ వంటివి అనుసంధానం అవుతున్నాయని, బిజినెస్ మేనేజ్మెంట్లో కూడా వీటి ప్రాముఖ్యత ఉందన్నారు. ఏయూ సిబ్లో విభిన్న దేశాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తున్నారని, తద్వారా భారతీయ విద్యార్థులకు విభిన్న సంస్కృతులను పరిచయం చేసుకోవడానికి, తెలుసుకోడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక శాతం విదేశీ విద్యార్థులను కలిగిన విశ్వవిద్యాలయంగా ఏయూ నిలుస్తోందన్నారు. విద్యార్థులకు విదేశాల్లో సైతం ఇంటర్న్షిప్ అందించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం సంచాలకుడు ఆచార్య పి.విశ్వనాథం మాట్లాడుతూ 26 దేశాలకు చెందిన విద్యార్థులు తమ వద్ద విద్యను అభ్యసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో కామర్స్ మేనేజ్మెంట్ విభాగాధిపతి ఆచార్య జాలాది రవి, ఏయూ సిబ్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.