
పదిలో తగ్గిన ఉత్తీర్ణత
● పదో తరగతి ఫలితాల్లో 2 శాతం తగ్గిన జిల్లా ఉత్తీర్ణత ● 89.14 శాతంతో 3వ స్థానంలో నిలిచిన విశాఖ జిల్లా ● 28,435 మందికి గాను 25,346 మంది పాస్ ● 90.05 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించిన బాలికలు
ఆరిలోవ : రాష్ట్రంలో బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో విశాఖ జిల్లాలో గత ఏడాది కంటే 2 శాతం ఉత్తీర్ణత తగ్గింది. 2023–24 విద్యా సంవత్సరంలో 91.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా ఈ ఏడాది 89.14 శాతానికి పడిపోయింది. అలాగే విశాఖ జిల్లా గతేడాది పదో తరగతి ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలవగా ఈ ఏడాది మూడో స్థానానికి చేరడంతో జిల్లా విద్యాశాఖాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 28,435 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 25,346 మంది(89.14 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. 15,045 మంది బాలురు పరీక్ష రాయగా 13,288 మంది (88.32 శాతం), 13,390 మంది బాలికలు పరీక్ష రాయగా 12,058(90.05 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.
ఫస్ట్ డివిజన్లో 21,833 మంది
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 25,346 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 21,833 మంది ఫస్ట్ డివిజన్, 2,367 మంది సెకండ్ డివిజన్, 1,146 మంది థర్డ్ డివిజన్లో ఉత్తీర్ణుత పొందారు.
కార్పొరేట్ పాఠశాలలదే పైచేయి..
వేపగుంట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఇండిగ శ్రీవేద 593/600 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా టాపర్గా నిలవగా, భీమునిపట్నం రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని రెడ్డి భవ్యశ్రీ 592/600 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. జ్ఞానికేతన్ ఎయిడెడ్ పాఠశాలలో చదివిన డబ్బీరు చరణ్సాయి, నరవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన రెడ్డి సౌజన్య 591 మార్కులతో జిల్లాలో మూడో స్థానంలో నిలిశారు. నగరంలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో చదివిన సాయితన్వీ 599/600, ఎ.లిఖిత 599/600, అనీష 599/600 మార్కులు సాధించారు. దీంతోపాటు 598, 597, 596 మార్కులు సాధించినవారు వేలల్లో ఉండటం విశేషం.
ఏపీ రెసిడెన్షియల్స్లో శత శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. భీమునిపట్నం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలో 85 మంది పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. దీంతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న 10 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇదిలా ఉండగా 42.17 శాతం ఉత్తీర్ణత సాధించిన ఏయూ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల జిల్లాలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
సోషల్ వెల్ఫేర్లో 73.07 శాతం ఉత్తీర్ణత
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులు 73.07 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు వెల్లడించారు. ఈ ఏడాది వసతి గృహాలకు చెందిన 78 మంది పరీక్షలకు హాజరు కాగా 57 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. జిల్లా పరిధిలో మూడు హాస్టల్స్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుంచి 28 వరకు జరగనున్నాయని డీఈవో ప్రేమ్కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈనెల 24 నుంచి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. రీకౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున మే ఒకటో తేదీ వరకు ఏపీ ఆన్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు.
ఐఏఎస్ అవుతా..
పదో తరగతిలో 599 మార్కులు రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇది సాధ్యమైంది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూపు తీసుకుంటాను. జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తిచేస్తాను. తరువాత సివిల్స్ రాసి ఐఏఎస్ అవుతాను. రాష్ట్రానికి, దేశానికి సేవలు అందిస్తాను.
– సాయి తన్వీ, 599 మార్కులు
ఐఐటీలో చదవడమే లక్ష్యం
సైన్స్ సబ్జెక్టులో రెండు మార్కుల ప్రశ్నలో చేసిన తప్పిదం కారణంగా ఒక్క మార్కు తగ్గింది. అయినా మంచి మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. అమ్మనాన్న ప్రోత్సాహంతో పాటు స్కూల్ యాజమాన్యం అందించిన సహకారంతో ఇన్ని మార్కులు సాధించగలిగాను. ప్రముఖ ఐఐటీలో ఉన్నత విద్యనభ్యసించి అమ్మనాన్నలకు మరింత పేరు తెస్తాను.
– ఆళ్ల లిఖిత, 599 మార్కులు

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత

పదిలో తగ్గిన ఉత్తీర్ణత