
సాక్షి మీడియాపై దాడి గర్హణీయం
సీతమ్మధార : ఏలూరులో సాక్షి దినపత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాల దాడి గర్హణీయమంటూ విశాఖలో పాత్రికేయులు బుధవారం ఆందోళన నిర్వహించారు. జీవీఎంసీ గాంధీపార్కులో సాక్షి దినపత్రిక విశాఖ బ్యూరో చీఫ్ కేజీ రాఘవేంద్రరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది, పలు పాత్రికేయ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మీడియాపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సాక్షి బృందంపై పెట్టిన కేసుల గురించి ఆందోళనలు మరిచిపోకముందే ఏలూరు జిల్లాలో సాక్షి కార్యాలయం మీద టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. డెస్క్ ఇన్చార్జి బి.బి.సాగర్ మాట్లాడుతూ పత్రికల్లో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే యాజమాన్యాలకు ఖండన పంపాలి తప్ప దాడులు సరికాదన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో కూడా తహసీల్దార్పై దాడులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు సాక్షి మీద కూడా దాడులకు దిగడం, అధికార పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఏపీయూడబ్ల్యూజే విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు కె.టి.రామునాయుడు మాట్లా డుతూ టీడీపీ గూండాలు పత్రికల మీద దాడి చేయడం, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా పేర్కొన్నారు. నిరసనలో సాక్షి విశాఖ యూనిట్ పాత్రికేయులు, వివిధ పాత్రికేయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.