
26 నుంచి ఏయూ శతాబ్ది ఉత్సవాలు
విశాఖ సిటీ : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయని ఉపకులపతి ప్రొ.రాజశేఖర్ తెలిపారు. అకడమిక్ సెనేట్ మందిరంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ తొలి రోజు ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్లో శతాబ్ది వాక్థాన్తో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయన్నారు. ఉదయం 9 గంటల కు ఏయూ పరిపాలన భవనం వద్ద బెలూన్ లాంచింగ్, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ప్రధాన వేడుకలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.మధుమూర్తి, ఐఐటీ పాలక్కడ్ డైరెక్టర్ ప్రొ.శేషాద్రి శేఖర్ అతిథులుగా హాజరవుతారన్నారు. ఇందులో భాగంగా విజన్ డాక్యుమెంట్, శతాబ్ది ఉత్సవాల వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. విశ్వ విద్యాలయంలో నూతన భవనాలు, సెంట్రల్ ల్యాబ్ ఫెసిలిటీ, పూర్వ విద్యార్థుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన జ్ఞాపికగా ప్రత్యేక ఐకానిక్ టవర్ని నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఎన్.కిషోర్బాబు, రిజిస్ట్రార్ ప్రొ.ధనుంజయ్రావు, తదితరులు పాల్గొన్నారు.