
ఇంతలోనే.. అంత మార్పా..!
● కాలుష్య నియంత్రణ చర్యలకు తూట్లు ● వ్యక్తిగత వాహనాలపైనే అధికారుల రాకపోకలు ● గేట్ నుంచి మాత్రం నడుచుకుంటూ చాంబర్లకు చేరిన వైనం
డాబాగార్డెన్స్: కాలుష్య రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఎంతగానో కృషి చేశారు. మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వారంలో ఓ రోజు(ప్రతి సోమవారం) తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనాన్ని వదిలి, ప్రజా రవాణా వ్యవస్థ(ఆర్టీసీ) బస్సులో జీవీఎంసీకి చేరుకునేవారు. కాలుష్య నియంత్రణకు ఉద్యోగులతో పాటు విశాఖ నగర పౌరులు కూడా సహకరించాలని ప్రతి వారం పిలుపునిచ్చేవారు. వారంలో ఒక రోజు వ్యక్తిగత వాహనాలు వీడి, ప్రజా రవాణాను వినియోంచాలని సూచించేవారు. అందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించారు. ఇప్పుడిదంతా గతం.. కానుంది.
మేయర్ పీఠం మారడంతో..
కూటమి కార్పొరేటర్లు, నేతలు కుట్రలు, కుతంత్రాలతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఇంకేముంది.. అధికారుల తీరు మారింది. కాలుష్య నియంత్రణపై మేయర్ పిలుపును పక్కన పెట్టేశారు. ఎలాగూ మేయర్ లేరన్న ధీమాతో దర్జాగా జీవీఎంసీ తమకు కేటాయించిన వాహనాల్లోనే ఇళ్ల వద్ద బయల్దేరి, కార్యాలయానికి చేరుకున్నారు. గేట్ వద్ద వాహనం దిగి, ఆ పది మీటర్లు మాత్రం నడిచి, ప్రధాన కార్యాలయం లోపలికి చేరుకున్నారు. పైకి కాలినడకన వస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్న అధికారుల తీరు తొలి వారమే బట్టబయలైంది.
గేటు ముందు వాహనం దిగి..
వాస్తవంగా సోమవారం నో వెహికల్ డే. దీంతో ఇళ్ల వద్ద నుంచే వ్యక్తిగత వాహనాలను వీడాలి. అయితే మన అధికారులు మాత్రం మేయర్ పీఠం మారనుండటంతో.. కొత్త మేయర్ పదవీ బాధ్యతలు స్వీకరించి, ఆదేశాలివ్వకముందే.. కాలుష్య నియంత్రణ చర్యలకు తూట్లు పొడిచారు. ఇంటి నుంచే వాహనాల్లో దర్జాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయ వద్ద దిగారు. ఆ గేట్ నుంచి నడుచుకుంటూ కార్యాలయంలోకి చేరారు. ఆ వాహనాలను డ్రైవర్లు జీవీఎంసీ కార్యాలయం చుట్టూ పార్కింగ్ చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా కొందరు తమ వాహనంలో ఇంటికి వెళ్లి, వచ్చారు. సాయంత్రం విధులు ముగించుకుని మళ్లీ వాహనాల్లోనే హుందాగా ఎవరింటికి వారు చేరుకున్నారు.

ఇంతలోనే.. అంత మార్పా..!