సమస్యల పరిష్కారంపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారంపై దృష్టి

Apr 22 2025 2:33 AM | Updated on Apr 22 2025 2:33 AM

సమస్య

సమస్యల పరిష్కారంపై దృష్టి

● కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ ● పీజీఆర్‌ఎస్‌లో 402 వినతుల స్వీకరణ

బీచ్‌రోడ్డు : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ స్వయంగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్‌, జీవీఎంసీ చీఫ్‌ సిటీ ప్లానింగ్‌ అధికారి ప్రభాకర్‌ కూడా వినతులు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా చూడాలని ఆదేశించారు.

402 వినతుల స్వీకరణ

సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 402 వినతులను అధికారులు స్వీకరించారు. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 173 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించి 36, జీవీఎంసీ సంబంధించి 110 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 83 వినతులు వచ్చాయి.

పీజీఆర్‌ఎస్‌పై సమీక్ష

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందు అధికారులతో కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రెడ్రెసెల్‌ సిస్టమ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్‌ తెలిపారు. సీఎంవో, డిప్యూటీ సీఎంవో కార్యాలయాల నుంచి వచ్చే అర్జీలకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు శాఖాపరమైన సమీక్షలు నిర్వహించాలని, అర్జీలు ఎక్కువగా ఉంటే ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు. పింఛన్లు, భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హౌస్‌ హోల్డ్‌ సర్వేలో ఉద్యోగుల నమోదు వివరాలు వారం రోజుల్లో పూర్తి చేయాలని, విజన్‌ డాక్యుమెంట్‌ ప్రగతిని సమీక్షించాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించిన తర్వాత ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని కలెక్టర్‌ సూచించారు.

ఏపీ ట్రాన్స్‌కో పోస్టుల భర్తీలో అక్రమాలు

ఏపీ ట్రాన్స్‌కోలో నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యోగుల భర్తీ జరుగుతోందని గాజువాకకు చెందిన జె.శ్రీలక్ష్మి ఆరోపించారు. రోస్టర్‌ విధానం (ఆర్‌వోఆర్‌) పాటించకుండా నియామకాలు చేస్తున్నారని, ఒక్కో పోస్టును రూ.10 లక్షలకు అమ్ముకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎక్కువ మార్కులు వచ్చినా డబ్బులు ఇవ్వలేదని, తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని వాపోయింది. ఈ విషయంపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌కు అర్జీ అందజేసింది.

గ్రామాన్ని వెలివేయడం తగదు

మరణించిన విద్యుత్‌ కార్మికుడికి నష్టపరిహారం కోరినందుకు మళ్లం గ్రామాన్ని వెలివేసిన ఘటనపై కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపిన అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. నష్టపరిహారం అడిగినందుకే గ్రామాన్ని వెలివేయడం దారుణమన్నారు. కుల బహిష్కరణకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే తమపై దాడులు కొనసాగుతున్నాయని దళిత సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటనే మళ్లం గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సమస్యల పరిష్కారంపై దృష్టి 1
1/1

సమస్యల పరిష్కారంపై దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement