
లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20న సమ్మె
డాబాగార్డెన్స్: కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ కె.హేమలత డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డాబాగార్డెన్స్లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సిటు రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమేనని హేమలత విమర్శించారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు మారుస్తూ.. కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అదానీ, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక, కర్షకులకు ద్రోహం చేస్తోందని ఆమె ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్ సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేయడం దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమేనని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.26 వేలు, కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచి, పని భారం తగ్గించాలని కోరారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే వక్ఫ్ చట్టంలో మార్పులు చేసిందన్నారు. సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని 12–14 గంటలకు పెంచే ప్రయత్నం జరుగుతోందని, పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమన్నారు. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపి, భారాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సిటు అఖిల భారత ఉపాధ్యక్షురాలు బేబీరాణి, రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, అజయ్కుమార్, కె.సుబ్బరావమ్మ, కె.ధనలక్ష్మి, ముజఫర్ అహ్మద్, రమాదేవి, ఆర్.వి.నర్సింగరావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్, డీఎన్వీడీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
సిటు అఖిల భారత అధ్యక్షురాలు కె.హేమలత