
అండర్–7 చెస్ జట్టుకు ధనుష్, ధియా ఎంపిక
విశాఖ స్పోర్ట్స్: అండర్–7 అంతర జిల్లాల చదరంగం జట్టు ఎంపిక పోటీల్లో విశాఖకు చెందిన ధనుష్ (ఓపెన్ విభాగం), ధియా తేజశ్రీ బుద్ద (బాలికల విభాగం) రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. వీరు పల్నాడు జిల్లాలో జరగనున్న స్టేట్ అంతర జిల్లాల అండర్–7 చాంపియన్షిప్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆల్ విశాఖ చదరంగం సంఘం ఆధ్వర్యంలో గాయత్రి విద్యా మందిర్లో ఆదివారం ఈ ఎంపిక పోటీలు జరిగాయి. ఓపెన్ విభాగంలో 23 మంది, బాలికల విభాగంలో 13 మంది చిన్నారులు పోటీపడ్డారు. ఓపెన్లో ఐదు రౌండ్లు, బాలికల కోసం నాలుగు రౌండ్లు నిర్వహించారు. ఓపెన్ విభాగంలో ధనుష్ పిల్ల ఐదు రౌండ్లలో నాలుగున్నర పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. ద్వితీయ స్థానంలో నిలిచిన అభినవ వైద్య భూషణ నాలుగు పాయింట్లు సాధించాడు. వీరిద్దరూ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. ఐదు రౌండ్ల తర్వాత బి.విఖ్యాత్, ఎ.కార్తికేయ, నిహాన్ దొగ్గాలు కూడా నాలుగేసి పాయింట్లతో నిలిచినా ప్రోగ్రెసివ్ స్కోరు ఆధారంగా వారు వెనుకబడిపోయారని నిర్వాహకులు తెలిపారు. బాలికల విభాగంలో దియా తేజశ్రీ బుద్ద నాలుగు రౌండ్లలోనూ విజయంతో నాలుగు పాయింట్లు సాధించింది. మూడు పాయింట్లు సాధించిన అదిత్రి ద్వితీయ స్థానంలో నిలిచింది. తేజోసన్విక, అదిత్రితో సమానంగా పాయింట్లు సాధించినా.. ప్రోగ్రెసివ్ స్కోరు కారణంగా అర్హత సాధించలేకపోయింది. ఓపెన్, బాలికల విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. జిల్లా స్థాయి అండర్–7 ఓపెన్లోనూ, బాలికల్లోనూ తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి జిల్లా జట్టుగా అర్హత కల్పించినట్లు సంఘం కార్యదర్శి మణికంఠ తెలిపారు.