
నాటి సంస్కరణలే నేటి ఫలితాలు
సంకల్ప బలం ఉండాలే గానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎంతో దూరదృష్టితో ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను ఇస్తున్నాయి. నాడు–నేడు పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దారు. విద్యాబోధనలోనూ సమూల మార్పులు చేశారు. ఫలితంగా తాజా ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడి మార్కులు సాధించారు. స్టేట్ టాపర్లుగా నిలిచి నత్తా చాటారు.
వి.ఎస్.కృష్ణా కళాశాలలో విద్యా బోధన
● ప్రభుత్వ కాలేజీల్లో ఆధునిక సౌకర్యాలు
● విద్యాబోధనలో సమూల మార్పులు
● ఇంటర్లో మార్కులతో
మెరిసిన విద్యార్థులు
● స్టేట్ టాపర్ల జాబితాలో
జిల్లాలో నలుగురికి చోటు
● కార్పొరేట్కు దీటుగా
రాణించిన విద్యార్థులు
● వైఎస్ జగన్ పాలనను
తలచుకుంటున్న తల్లిదండ్రులు
గతేడాది చదువులే బెస్ట్
ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఫస్టియర్ కంటే, సెకండ్ ఇయర్లోనే మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఫస్టియర్లో జిల్లాలోని ప్రభుత్వ కాలేజీలు మొత్తంగా 34.17 శాతం కాగా, సెకండ్ ఇయర్లో 55 శాతం ఫలితాలు వచ్చాయి. అదే ఒకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్లో 69.9 శాతం కాగా, సెకండ్ ఇయర్ 81.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ లెక్కన ఈ ఏడాది కంటే గత ఏడాది వరకు సాగిన చదువులతో పడిన పటిష్టమైన పునాదుల కారణంగానే ప్రస్తుత ఫలితాల్లో విద్యార్థులు మెరిసినట్లు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
విశాఖ విద్య/మద్దిలపాలెం: ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థులు ఫస్ట్క్లాస్లో పాసైతే ఒకప్పుడు పెద్దగొప్ప. కానీ నేడు పరిస్థితి మారింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు సైతం కార్పొరేట్కు తీసుపోమన్నట్లుగా టాప్ మార్కులతో అదరగొట్టారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు మార్కుల్లో మెరిశారు. ఏకంగా నలుగురు విద్యార్థులు స్టేట్ టాపర్ల జాబితాలో చోటు దక్కించుకొని షైనింగ్ స్టార్ పురస్కారాలను అందుకున్నారు. 900లకు పైగా మార్కులు సాధించిన పలువురు విద్యార్థులు తమ చదువుల సారానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణల ఫలితమేనని బాహాటంగానే చెబుతున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పేదింటి బిడ్డలు చదువుల్లో రాణించాలనే సంకల్పం, నేడు సత్ఫలితాలు దిశగా సాగుతుండటంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు సైతం నాటి పాలనను గుర్తుచేసుకుంటున్నారు.
ప్రభుత్వ కాలేజీలు బాగుండాలనే..
ఒకప్పుడు ప్రభుత్వ కాలేజీలంటే చిన్నచూపు ఉండేది. అందుకనే నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్యవైపు వచ్చేవారు కాదు. దీన్ని గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనలో విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు, జూనియర్ కాలేజీల అభివృద్ధికి సైతం నిధులు కేటాయించారు. జిల్లాలోని భీమునిపట్నం, అగనంపూడి, పెదగంట్యాడ, పెందుర్తి, జైల్ రోడ్లోని బాలికల కాలేజీ, డాక్టర్ వీఎస్ కృష్ణా కాలేజీ, ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీలో మౌలిక సౌకర్యాలు పెంపొందించేలా రూ.6.2 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆయా కాలేజీల్లో గతంలో ఎన్నడూ లేని రీతిన మౌలిక వసతులు మెరుగుపడ్డాయి.
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో విద్యనభ్యసించాను. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా డాక్టర్ వి.ఎస్.కృష్ణా ఓకేషనల్ కళాశాలలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సు(ఈటీ)లో జాయిన్ అయ్యాను. 979 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సద్వినియోగం చేసుకుంటే ఉజ్వల భవిత ఉంటుంది.
– ఎం.విజయకుమార్, 979 మార్కులు (ఈటీ)

నాటి సంస్కరణలే నేటి ఫలితాలు

నాటి సంస్కరణలే నేటి ఫలితాలు