
భగవద్గీతకు యునెస్కో గుర్తింపు హర్షణీయం
డాబాగార్డెన్స్: భగవద్గీతను యునెస్కో గుర్తించడం హర్షణీయమని గీతా ప్రచార సమితి ప్రతినిధి, ఆధ్యాత్మికవేత్త ఎంవీ రాజశేఖర్ అన్నారు. కురుక్షేత్ర మహా సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీత ఆవిర్భవించి వేల సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ భగవద్గీత భక్తి జ్ఞానములతో కూడిన శోభ చెక్కు చెదరలేదన్నారు. ప్రపంచ దేశాలన్నీ విశ్వసిస్తున్న అత్యున్నతమైన ఆధ్యాత్మిక గ్రంథం భగవద్గీతేనన్నారు. ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించాలన్నా.. ధర్మాన్ని ఆచరించాలన్నా భగవద్గీతను అనుసరించాల్సిందేనన్నారు. విశ్వానికంతటికీ ఎన్నో విధాలుగా.. సగటు జీవికి అనేక రకాలుగా దిక్సూచిగా, మార్గదర్శిగా జీవన ప్రయాణంలో భగవద్గీత భాగంగా ఉందని పేర్కొన్నారు. భగవద్గీతను మరచిపోవద్దని, గీతను దాటొద్దని, సంపూర్ణ గీతా సారాంశం తెలుసుకుని జీవించాలని పిలుపునిచ్చారు.