
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
షాద్నగర్రూరల్: గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన శుక్రవారం మున్సిపల్ పరిధిలోని సోలీపూర్ శివారులోగల బీబీజీ వెంచర్లో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవరాజ్ తెలిపిన ప్రకారం.. బీబీజీ వెంచర్లోని నిర్మానుష్య ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(28) మృతదేహం ఉన్నట్లు వెంచర్ నిర్వాహకులు గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం, ఎముకలు తేలిపోవడం చూస్తుంటే 10 రోజుల క్రితమే మహిళ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళ ఆత్మహత్యకు పాల్పడిందా..? గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువచ్చి హత్య చేశారా అనే కోణంలో విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంచర్ సూపర్వైజర్ ఇంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వృద్ధుడి అదృశ్యం
పహాడీషరీఫ్: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. పహాడీషరీఫ్కు చెందిన షేక్ మహబూబ్(70), షానవాజ్ బేగం దంపతులు దర్గా వద్ద నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా మహబూబ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. నెల క్రితం చివరగా కుమారుడు ముజఫర్తో ఫోన్లో మాట్లాడిన మహబూబ్ అనంతరం అందుబాటులోకి రాలేదు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై ముజఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్లో గాని 87126 62367 నంబర్లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
రేపటి నుంచి ఓయూలో తరగతులు ప్రారంభం
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్తో పాటు అనుబంధ, ప్రైవేటు కాలేజీలలో జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల వేసవి సెలవుల అనంతరం తిరిగి తరగతులను పునఃప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్సిటీ క్యాంపస్లో కాలేజీలతో పాటు హాస్టల్స్, మెస్సులను కూడ పునఃప్రారంభించనున్నారు.
అప్పు తీసుకుని చెక్కేశాడు
● ఇద్దరు మహిళల పేరుతో రూ. 25 లక్షల రుణం
● యువకుడిపై కేసు నమోదు
వెంగళరావునగర్: ఓ వ్యక్తి ఇద్దరు మహిళల పేరున రూ.25 లక్షలు రుణం తీసుకుని మోసం చేసిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. యాదగిరినగర్కు చెందిన యూ ట్యూబర్గా పని చేస్తోంది. ఆమెకు పరిచయస్తురాలైన నాగరాణి అనే యువతి గత ఏడాది రాజశేఖర్ అనే వ్యక్తిని పరిచయం చేసింది. అతను దీవెనకు ఫోన్ చేసి అకౌంట్ నెంబర్ అడిగి ప్రతినెల రూ. 20 వేలు నగదు డిపాజిట్ చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని తన స్నేహితురాలు నవజ్యోతికి వివరించి ఇద్దరి నెంబర్లు ఇస్తామని, ఇరువురికీ నగదు వేయాలని రాజశేఖర్ను కోరింది. అందుకు అంగీకరించిన అతను వారి నుంచి ఆధార్కార్డులు, వేలిముద్రలు, తీసుకుని వారి పేరున బ్యాంక్ ఖాతాలు తెరిచాడు. మూడు నెలల పాటు ఆయా అకౌంట్లలో నగదు డిపాజిట్ చేసిన అతను, నాలుగో నెల వేయలేదు. దాంతో వారు బ్యాంకులకు వచ్చి ఆరా తీయగా దీవెన పేరున రూ. 10 లక్షలు, నవజ్యోతి పేరుతో రూ. 15 లక్షలు రుణం తీసుకున్నట్లుగా తెలిసింది. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు రాజశేఖర్పై చర్యలు తీసుకోవాలని మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.