
నేడు మర్పల్లికి ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి
మర్పల్లి: మండల కేంద్రానికి గురువారం ఉదయం 11 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి రానున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, మండల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన కోరారు.
బడులకు పాఠ్య పుస్తకాలు
దుద్యాల్: బడుల ప్రారంభం నాటికి పాఠ్య పుస్తకాలు చేరాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇదివరకే మండల విద్యావనరుల కేంద్రానికి నూతన పుస్తకాలు చేరాయి. దీంతో పాఠశాలలకు వాటిని పంపిణీ చేసే పనిలో సీఆర్పీలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే మండల పరిధిలోని చెట్టుపల్లి తండాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, హకీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు బుధవారం పంపిణీ చేశారు. రెండు పాఠశాలలకు కలిపి 2,400 పుస్తకాలు అందించినట్లు సీఆర్పీ రాందాస్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల పాఠశాలలకు వంట సామగ్రి సైతం పంపిణీ చేశారు.
బిల్లు ఎక్కువ
వేశారన్నందుకు
● లైట్లు ఆర్పి మహిళలపై దాడి
● జూబ్లీహిల్స్లోని
బేబీలాన్ పబ్లో ఘటన
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్లో తాము ఆర్డర్ చేయని డ్రింక్స్కు బిల్ వేశారని ప్రశ్నించినందుకు సిబ్బంది కస్టమర్లపై దాడికి పాల్పడ్డారు. పబ్లో లైట్లు ఆర్పి తన తల్లి, చెల్లిపై దాడి చేశారని సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ మీనల్ మీను ఆరోపిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మీనల్మీను మంగళవారం రాత్రి తన తల్లి, చెల్లితో కలిసి జూబ్లీహిల్స్లోని బేబీలాన్ పబ్కు వెళ్లింది. ఈ సందర్భంగా తాము తాగని డ్రింక్స్కు కూడా బిల్లు వేసినట్లు గుర్తించిన ఆమె పబ్ సిబ్బందిని ప్రశ్నించింది. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన పబ్ నిర్వాహకులు సిబ్బందితో కలిసి పబ్లో లైట్లు ఆపేసి ఆమె తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వివరించింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్ వేశారని అడిగినందుకు కొట్టారని, వీడియో తీస్తుంటే బెదిరించి లైట్లు ఆర్పేసి దాడి చేశారని పేర్కొంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి న పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే పలువురు సిబ్బందిని విచారించారు. దాడికి పాల్పడింది బౌన్సర్లా..? సిబ్బందా అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
రైలు కిందపడి
యువకుడి ఆత్మహత్య
సికింద్రాబాద్: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ కోటేశ్వర్రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ట్రాలీ పాత్ వే రైల్వే ట్రాక్ ప్రక్కన బుధవారం ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు సుమారు 25 ఏళ్ల యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్యహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. మృతుడి ఒంటిపై తెలుపు, నలుపు గల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ప్యాంటు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
కేరళ లాటరీ పేరుతో రూ.7.55 లక్షలు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగినికి కేరళ లాటరీ పేరుతో ఎర వేసిన సైబర్ నేరగాళ్లు రూ.7.55 లక్షలు స్వాహా చేశారు. దీనిపై బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది. బాధితురాలికి (54) గత నెల 7న ‘కేరళ లాటరీ‘ ప్రతినిధి పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు తమ లాటరీ ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పాడు. దీంతో ఆమె ఓ టికెట్ ఖరీదు చేశారు. అదే రోజు సాయంత్రం రూ.5 లక్షల లాటరీ గెల్చుకున్నట్లు ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఆ మొత్తం తీసుకోవాలంటే ముందుగా కొన్ని పన్నులు చెల్లించాలంటూ ఓ లింకు పంపాడు. బాధితురాలు దానిని క్లిక్ చేయగా... లాటరీ గెల్చినట్లు, వివిధ పన్నులు చెల్లించాలని ఉంది. బాధితురాలు చెల్లించిన మొత్తం నామ మాత్రమే నాన్ రిఫండబుల్ అని, మిగిలింది లాటరీ నగదుతో పాటు రిఫండ్ చేస్తామని నమ్మించారు. ఇలా ఆమె నుంచి రూ.7, 55,220 డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు.