కొందరికే ‘భరోసా’ | - | Sakshi
Sakshi News home page

కొందరికే ‘భరోసా’

Apr 29 2025 9:49 AM | Updated on Apr 29 2025 10:11 AM

కొందర

కొందరికే ‘భరోసా’

నేటికీ 3.54 లక్షల ఎకరాలకే పెట్టుబడి సాయం

వికారాబాద్‌: రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాగా ఆ సంతోషం సగం మంది వద్దే ఆగిపోయింది. గతేడాదికి సంబంధించి పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నా 60 శాతం భూమికే సాగు సాయం అందింది. మరో 40 శాతం భూమికి సంబంధించి పెండింగ్‌లోనే ఉన్నాయి. వానాకాలం పంటలు సమీపిస్తున్నా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 26న రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి మరుసటి రోజు మండలానికి ఓ గ్రామం చొప్పున పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎంపిక చేసి 20 గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అనంతరం వారం తర్వాత ఒక ఎకరం, నెల రోజుల తర్వాత ఒక్కో ఎకరా పెంచుతూ ఇప్పటి వరకు నాలుగు ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు భరోసా డబ్బు జమ చేశారు.

పెండింగ్‌లో రూ.120 కోట్లు

జిల్లాలో ఉన్న సాగు భూమిలో ఇప్పటి వరకు 60 శాతం భూములకు మాత్రమే రైతు బరోసా డబ్బులు జమ అయ్యాయి. మరో 40 శాతం భూమికి ఇంకా డబ్బులు జమ కావాల్సి ఉంది. 3,12,872 మంది రైతులు పథకానికి అర్హులుండగా వారికి 6,03,500 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వీరిలో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు 2,26,253 మంది ఉన్నారు. వీరికి ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.212.52 కోట్లు ఖాతాల్లో జమ చేశారు. మరో 2.5 లక్షల మంది రైతులకు రూ.149.57 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 2,69,293 మంది రైతులకు సంబంధించి రూ.332.76 కోట్లు బిల్లులు రెడీ చేసి ట్రెజరీకి పంపించారు. బిల్లులు చేసి ట్రెజరీకి పంపిన మరో రూ.120 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.

ముంచుకొస్తున్న వానాకాలం సీజన్‌

రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వం ఏదయినా రైతులు పంటలు సాగు చేసే సమయంలో పెట్టుబడులకు మాత్రం అందివ్వడం లేదు. ఏడాది కాలం సాగు సాయం ఇవ్వని సర్కారు పంటలు ఇళ్లకు వచ్చాక సాగు సాయం అందిస్తుండడం సైతం రైతులను అసంతృప్తికి గురిచేస్తోంది. అయితే పథకం ప్రారంభించాక కూడా ఒక్కో ఎకరం చొప్పున డబ్బులు ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది. ఎకరం దాటి మరో ఎకరానికి డబ్బులు జమ చేసేందుకు మొదట్లో వారం రోజుల సమయం పట్టగా ఇప్పుడు నెల రోజులు పడుతోంది. పథకం ప్రారంభమై మూడు నెలలు గడిచినా నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాగుసాయం అందింది. ఈ లెక్కన పదెకరాల ఆపైన సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందటానికి మరో రెండు మూడు నెలల పడుతుందా..? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే కొంచం అటూ ఇటూగా మళ్లీ వర్షాకాలంలో ఖరీఫ్‌ విత్తనాలు ప్రారంభించేనాటికి కూడా మొదటి విడత రైతు భరోసా పూర్తవుతుందో లేదో అనే అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు.

పెండింగ్‌లో మరో రెండున్నర లక్షల ఎకరాలు

నాలుగు ఎకరాల వరకు ఉన్నరైతు ఖాతాల్లో నగదు జమ

పథకం ప్రారంభించి మూడు నెలలు గడిచినా పూర్తవని ప్రక్రియ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకం సగంమంది రైతులకే సంతోషాన్నిచ్చింది. నాలుగు ఎకరాలు ఉన్నరైతుల ఖాతాల్లోకి మాత్రమే పెట్టుబడి సాయం అందింది. వానాకాలం సమీపిస్తున్నా నేటికీ ఇంకా 40 శాతం భూమికి సాగు సాయం అందక ఎదురు చూపులు తప్పడం లేదు.

ఎదురుచూపులే మిగిలాయి

తమకు 6.17 ఎకరాల పొలం ఉంది. ప్రభుత్వం నుంచి రైతు భరోసా నగదు అందలేదు. కొత్త ప్రభు త్వం కొలువుదీరిన నాటి నుంచి ఎదురుచూపులు తప్పడం లేదు. ఇతర రైతులకు నగదు జమ అయి న ప్రతీసారి బ్యాంకుకు వెళ్లి చెక్‌ చేసుకుని వస్తున్నా. ఇంకా రాలేదనే చెబుతున్నారు. సాగుకు సాయం అందక ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం సకాలంలో నగదు జమ చేసి రైతులను ఆదుకోవాలి.

– గొల్ల అంజయ్య, రాంపూర్‌, మర్పల్లి మండలం

ట్రెజరీకీ పంపించాం

జిల్లాలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా రైతులకు ఖాతాల్లో రూ.రెండు వందల కోట్లకు పైగా రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి. మరో రూ.120 కోట్లకు సంబంధించి బిల్లులు చేసి ట్రెజరీకి పంపించాం. వారి ఖాతాల్లోనూ త్వరలో నగదు జమ అవుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– మోహన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి

కొందరికే ‘భరోసా’1
1/2

కొందరికే ‘భరోసా’

కొందరికే ‘భరోసా’2
2/2

కొందరికే ‘భరోసా’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement