
మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి
తిరుపతి మంగళం : తిరుపతిలో ‘నేషనల్ మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని, ఇది ధరల స్థిరీకరణ, మార్కెట్ అభివృద్ధి, ఎగుమతుల ప్రోత్సాహం,కార్యకలాపాలు నిర్వహించగలదని, అలాగే చిత్తూరు జిల్లాలో శ్రీజాతీయ మామిడి పరిశోధనా కేంద్రం’ చేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తోతాపురి మామిడి ధరలు భారీగా క్షీణించడంతో రైతులు నష్టపోతున్నారని ఎంపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మామిడి మద్దతు ధర కిలోకు రూ.12 ఉన్నప్పటికీ రైతులు కిలో కేవలం రూపాయి నుంచి నాలుగు రూపాయలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని, ఇది పంట పెట్టుబడులను పొందలేని దుస్థితి అని వివరించారు. కూలీల ఖర్చులు కూడా అందకుండా పోవడంతో చెట్లపైనే మామిడిని వదిలేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి ధర పతనంతో ఉత్పన్నమైన పలు కారణాలతో చిత్తూరు–తిరుపతి ప్రాంతంలో ఉన్న 52 మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో 28 యూనిట్లు మూత పడినట్లు లేఖలో వివరించారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని రైతు ఆదాయం రెట్టింపు అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి