
ఆర్టీసీ అభివృద్ధికి కృషి
తిరుపతి అర్బన్ : ఆర్టీసీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి డీపీటీవోగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి డీపీటీవోగా పనిచేస్తున్న వెంకట్రావ్ విజయవాడ ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో చిత్తూరు డీపీటీవోగా పనిచేస్తున్న జగదీష్ను తిరుపతికి నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరేళ్లుగా రాబడిలో తిరుపతి జిల్లా మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. ప్రయాణికుల అవసరాలను బట్టి బస్సుల సర్దుబాటు ఉంటుందని తెలిపారు. ప్రయాణికులకు తొలి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు.
సర్టిఫికెట్ల పరిశీలనకు
193 మంది హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : పాలిసెట్ కౌన్సెలింగ్లో భాగంగా తిరుపతి కేటి.రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం 1,04,001వ ర్యాంకు నుంచి లక్షా 20 వేలు ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనను నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్ 193 మంది విద్యార్థులు హాజరై తమ సర్టిఫికెట్లను పరిశీలన చేయించుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై.ద్వారకనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్లో భాగంగా చివరి రోజైన శనివారం 1,20,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న విద్యార్థులు ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వెబ్ ఆప్షన్ ద్వారా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాలని కోరారు.
కల్కి ట్రస్టు భూమిపూజపై ఫిర్యాదు
బుచ్చినాయుడుకండ్రిగ : మండలంలోని తలారివెట్టు గ్రామ రెవెన్యూలోని ప్రభుత్వ ఇంటి స్థలాల లే అవుట్లో కల్కి ట్రస్టు దాసాజీలు శుక్రవారం పూజలు చేయడంపై తలారివెట్టు, వేణుగోపాలపురం గ్రామస్తులు తహసీల్దారు శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తలారివెట్టు రెవెన్యూలో ప్రభుత్వం 6 ఎకరాల 50 సెంట్ల భూమి ఇంటి స్థలాలు లేని వారికి ఇవ్వాలని ప్రభుత్వం రైతుల నుంచి భూసేకరణ పథకంలో కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వ లే అవుట్లో ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదని, అయితే కల్కి దాసాజీలు లే అవుట్లో ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజలు చేయడం దారుణమని తెలిపారు. లే అవుట్ పక్కన కల్కి ట్రస్టుకు సంబంధించి 200 ఎకరాల భూమి ఉందని, భూమి విలువను పెంచుకోవడానికి దాసాజీలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ లే అవుట్లోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. తలారివెట్టు, కల్లివెట్టు, వేణుగోపాలపురం, గ్రామాల్లో ఇంటి స్థలాలు లేనివారు 200 మందికి పైగా ఉన్నారని వీరందరికి తలారివెట్టు గ్రామ రెవెన్యూలోని లే అవుట్లో స్థలాలు ఇవ్వాలని కోరారు. దీనిపై తహసీల్దారు శ్రీదేవి మాట్లాడుతూ.. విచారించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సులువు రీతిలో బోధించాలి
బుచ్చినాయుడుకండ్రిగ : విద్యార్థులకు సులువు రీతిలో పాఠాలు బోధించాలని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ గౌరీశంకర్రావు తెలిపారు. శుక్రవారం బుచ్చినాయుడుకండ్రిగ, నెలవాయి గ్రామాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలను పరిశీలించి మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు , యూనిఫాం, బ్యాగ్లు అందించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పీఎం శ్రీ పాఠశాలకు సంబంధించిన కెమిస్ట్రీ ల్యాబ్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, కిచెన్ గార్డెన్ వేసిన ఫెన్సింగ్ను పరిశీలించారు. బుచ్చినాయుడుకండ్రిగలోని భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఐఈ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎంఈఓలు రవీంద్రనాథ్, మునిసుబ్రమణ్యం, ప్రధానోపాధ్యాయులు రమణయ్య, హరిప్రియ పాల్గొన్నారు.

ఆర్టీసీ అభివృద్ధికి కృషి

ఆర్టీసీ అభివృద్ధికి కృషి