
పరేషన్పై మహిళల నిరసన
వెంకటగిరి రూరల్ : రేషన్ సరుకులను ఇంటి ముంగిటకే చేర్చే ఎండీయూ వాహనాలను రద్దు చేయడంపై మహిళలు మండిపడ్డారు. చౌక దుకాణాల్లోనే బారులు తీరి సరుకులు తీసుకోవాలని ఆదేశించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు పట్టణంలోని వల్లివేడు క్రాస్ వద్ద నిరసనకు దిగారు. మహిళలు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానంలోనే రేషన్ పంపిణీ చేయాలని నినాదాలు చేశారు. దుకాణాల వద్ద పడిగాపులు కాయలేమని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో సుమారు 50 కుటుంబాలు నివసిస్తున్నాయని, గతంలో మా వద్దకే వచ్చి సరుకులు ఇచ్చేవారని, ఇప్పుడు పట్టణంలోని మనులాలాపేటలోని దుకాణానికి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. అలాగే ఏఎంసీ గోడౌన్, పరశురామ్ కాలనీ వాసుల కూడా 5 కిలోమీటర్ల దూరంలోని మనులాలాపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. చివరకు 5 కేజీల బియ్యం తెచ్చుకునేందుకు సైతం ఆటో చార్జీకి రూ.40 వెచ్చించాల్సి వస్తుందని తెలిపారు. సరుకుల తీసుకోకుంటే కార్డు రద్దు చేస్తారని రేషన్షాపు నిర్వాహకులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఇంటి వద్దకే సరుకులు తీసుకువచ్చే ఎండీయూ వాహనాలను పునరుద్ధరించాలని కోరారు.