
సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 21 నుంచి మూడ్రోజుల పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయం నుంచి గురువారం ఉదయం 7 గంటలకు బయల్దేరి మంచిర్యాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి ఆమె పోషయ్యగూడెం, మంచిర్యాలలోని వరదలతో దెబ్బతిన్న కాలనీలను సందర్శిస్తారు.
అనంతరం రామగుండంలోని వర్షాలతో ప్రభావితమైన ప్రాంతాలను పరిశీలించి ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ నెల 22న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చేరుకుని మంథనిలో రైతులను పరామర్శించనున్నారు. అనంతరం అన్నారం, కన్నేపల్లి పంప్ హౌస్లను పరిశీలించనున్నారు. అక్కడ్నుంచి జయశంకర్భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి, ఆ రాత్రి బయ్యారంలో బస చేస్తారు. ఈ నెల 23న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి బయ్యారం, రెడ్డిపాలెం బూర్గంపహాడ్, భద్రాచలం వరద ప్రాంతాలను సందర్శించనున్నారు.