తెలంగాణ: అన్‌లాక్‌ 4 ఆంక్షల సడలింపు

TS Government Has Issued Orders Amending Unlock 4 GO 136 - Sakshi

అన్‌లాక్‌–4 జీవో (136)ను సవరిస్తూ ఉత్తర్వులు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనే వారి సంఖ్యపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ఈ మేరకు గత నెల 7న జారీ చేసిన అన్‌లాక్‌–4 జీవో (136)ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల జన సమీకరణకు ఈ ఆంక్షలు అడ్డంకిగా మారకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించకుండా సామాజిక/విద్య/క్రీడలు/వినోదం/సాంస్కృతిక/మత/రాజకీయ కార్యక్రమాలు, ఇతర సామూహిక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఇప్పటికే అనుమతులున్నాయి. అయితే కొన్ని షరతుల మేరకు కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపలి ప్రాంతాల్లో 100 మందికి మించిన సామర్థ్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ఇకపై అనుమతిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

ఆ షరతులివే..
► నాలుగు గోడల లోపలి (క్లోజ్డ్‌ స్పేసెస్‌) ప్రాంతాల్లో 50 శాతం సామర్థ్యం మేరకు గరిష్టంగా 200 మందికి మించకుండా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతిస్తారు. మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌/శానిటైజర్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.  

►  బహిరంగ ప్రదేశాల్లో(ఓపెన్‌ స్పెసెస్‌) స్థల పరిమాణాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు/పోలీసు కమిషనర్లు/ఎస్పీలు/స్థానిక సంస్థలు అధిక మందిని అనుమతించవచ్చు. అయితే మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించడం, థర్మల్‌ స్క్రీనింగ్, హ్యాండ్‌ వాష్‌/శానిటైజర్‌ వంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. (చదవండి: ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ ?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top