ఖమ్మం: ఇటీవల కాలంలో గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయి మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. జ్ఞాన దీపం వెలిగిస్తూ ఓ టీచర్ గుండె మౌనంగా మిగిలిపోయింది. బ్లాక్ బోర్డుపై తోటి టీచర్లకు ఇంగ్లిష్ ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఓ టీచర్ గుండె ఆగిపోయింది. ఈ విషాదకర ఘటన ఖమ్మంలోని మమతా రోడ్లో శ్రీచైతన్య ఒలింపియాడ్ క్యాంపస్లో జరిగింది. గారపాటి జయరాజ్ అనే టీచర్.. అక్కడకు హాజరైన టీచర్లకు ఇంగ్లిష్ ట్రైనింగ్ క్లాస్లు ఇస్తున్నాడు.
ఇంగ్లిష్ పాఠాలు చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తుండగా ఉన్నట్టుండి కూలిపోయాడు. తోటి టీచర్లు పరుగెత్తుకుని వచ్చి ఏమైందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాదకర ఘటనపై సహచర టీచర్లు సంతాపం వ్యక్తం చేశారు.


