
సనత్నగర్ (హైదరాబాద్): తెలంగాణను మరో కశ్మీర్లా మార్చాలనుకుంటున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు రాష్ట్రం లో కలసిమెలిసి జీవిస్తుంటే బండి సంజయ్ వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు. పాతబస్తీలోని చార్మినార్ను శనివారం సందర్శించారు. అనంతరం అమీర్పేట అపరాజితకాలనీలోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో తాను ఢిల్లీకి వెళ్లి బండి సంజయ్ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తీసివేయాలని అధిష్టానాన్ని కోరతానని చెప్పారు. రాష్ట్రంలోని ముస్లింలు, క్రైస్తవులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని పాల్ హెచ్చరించారు.