‘జీఎస్టీ’ దెబ్బ గట్టిగానే! | Huge blow to state exchequer as GST rate slabs reduced | Sakshi
Sakshi News home page

‘జీఎస్టీ’ దెబ్బ గట్టిగానే!

Sep 18 2025 4:41 AM | Updated on Sep 18 2025 4:41 AM

Huge blow to state exchequer as GST rate slabs reduced

జీఎస్టీ రేట్ల శ్లాబ్‌లు తగ్గించడంతో రాష్ట్ర ఖజానాకు భారీ గండి 

ప్రాథమిక అంచనాలు సిద్ధం చేసిన పన్నుల శాఖఅధికారులు.. ఐరన్‌ అండ్‌ స్టీల్, ఆటోమొబైల్స్,ఎఫ్‌ఎంసీజీ రంగాల్లో నష్టం ఎక్కువగా వచ్చే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల శ్లాబ్‌ల తగ్గింపు కారణంగా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రమారమి రూ.7 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఆయా వస్తువుల అమ్మకాలను బట్టి సుమారు రూ.5–7 వేల కోట్లు నష్టం వస్తుందని వాణిజ్య శాఖ వర్గాలు తమ ప్రాథమిక అంచనాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. 

జీఎస్టీ శ్లాబ్‌ల హేతుబద్దీకరణ కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లుతుందనే వివరాలను తెలియజేయాలని ప్రభుత్వం కోరిన మేరకు అన్ని రంగాల్లో వస్తువుల అమ్మకాలకు సంబంధించిన గణాంకాలను తెప్పించిన వాణిజ్య పన్నుల శాఖ ఈ మేరకు నష్ట నిర్ధారణ చేసినట్టు సమాచారం.  

ఎక్కువగా ఈ రంగాల్లోనే.. 
కాగా, జీఎస్టీ రేట్ల శ్లాబ్‌లను హేతుబద్దీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని పలు ప్రధాన రంగాల అమ్మకాలపై ప్రభావం చూపనుంది. రాష్ట్రం నుంచి ఎక్కువగా అమ్ముడయ్యే ఐరన్‌న్‌అండ్‌ స్టీల్, ఆటో మొబైల్స్‌ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పన్నుల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రంగాలతో పాటు ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసీజీ) అమ్మకాలపై వచ్చే పన్నులు కూడా పెద్ద ఎత్తున తగ్గిపోయి భారీ గండి పడుతుందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. 

అలాగే టెక్స్‌టైల్స్, సిమెంట్‌ లాంటి కీలక రంగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా కుదుపునకు గురవుతుందని, కొన్ని రంగాల్లో కొంత మేర అమ్మకాలు పెరిగినప్పటికీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో గండి పడటం ఖాయమని ఆ వర్గాలంటున్నాయి. అయితే, జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో ధరలు పెంచాలని ఐరన్‌ అండ్‌ స్టీల్, సిమెంట్‌ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ రెండింటి ధరలు పెరిగే అవకాశముందని కూడా వారు అంటున్నారు.  

వివరాల సేకరణకు తంటాలు 
జీఎస్టీ ద్వారా ఏ డీలర్‌ ఏయే సరుకులు, ఎంత మేర అమ్ముతున్నారన్న వివరాలను సేకరించి అంచనాలను రూపొందించడం కష్టతరంగా మారిందని పన్నుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. గతంలో వ్యాట్‌ అమల్లో ఉన్నప్పుడు డీలర్‌ కోడ్‌ నమోదు చేస్తే అన్ని సరుకుల వివరాలు వచ్చేవని, ఇప్పుడు జీఎస్టీలో ఆ వివరాలు అందుబాటులోకి రావడం లేదని, ఈ నేపథ్యంలో ప్రతి డీలర్‌ ఏ సరుకులు అమ్ముతున్నాడనే వివరాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించి మదింపు చేయాల్సి వస్తోందని పన్నుల శాఖ వర్గాలు అంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement