జనగణన 2011, ఎస్కేఎస్ 2014, కులగణన 2024 మధ్య పొంతన లేని జనాభా లెక్కలు
2011 జనగణనతో పోల్చితే 14 ఏళ్లలో పెరిగిన జనాభా 4.73 లక్షలే
2014 ఎస్కేఎస్తో పోల్చితే 2025లో తగ్గిన 13.98 లక్షల జనాభా
కులగణన గణాంకాలు నమ్మశక్యంగా లేవని విమర్శల వెల్లువ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా 2011 జనగణన నిర్వహించగా, తెలంగాణలో 3,50,03,674 మంది జనాభా ఉన్నట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,77,554 మంది అని తేల్చారు. రెండు సర్వేల మధ్య ఉన్న 14 ఏళ్ల నిడివిలో రాష్ట్ర జనాభా 4,73,880 మంది మాత్రమే పెరిగినట్టు పైన పేర్కొన్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్కేఎస్) గణాంకాల ప్రకారం అప్పట్లో రాష్ట్ర జనాభా 3,68,76,544 మంది కాగా, పదేళ్ల తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో రాష్ట్ర జనాభా 3,54,77,554 మందికి తగ్గిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎస్కేఎస్ గణాంకాలతో పోల్చితే తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వే గణాంకాల ప్రకారం రాష్ట్ర జనాభా 13,98,990 మంది తగ్గిపోయారు.
సహజంగా దేశంలో ఏటేటా జనాభా పెరిగిపోతుండగా, రాష్ట్రంలో మాత్రం తగ్గిపోయినట్టు పేర్కొంటున్న ఈ గణాంకాలు నమ్మశక్యంగా లేవని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో లక్షల సంఖ్యలో కుటుంబాలు గల్లంతైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


