ఇంట్లోకెళ్ళి బలవంతంగా మహిళపై ఎస్సై లైంగికదాడి..! | Case Filed Against Jammikunta SI Srikanth | Sakshi
Sakshi News home page

ఇంట్లోకెళ్ళి బలవంతంగా మహిళపై ఎస్సై లైంగికదాడి..!

Apr 27 2026 9:47 AM | Updated on Apr 27 2026 9:49 AM

Case Filed Against Jammikunta SI Srikanth

చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన హెడ్‌ కానిస్టేబుల్‌ నీలం రామ్మోహన్‌ సొంతశాఖ ఉద్యోగులకు అందాల్సిన జీతాలను కాజేశాడు. ఈ ప్రక్రియకు కరీంనగర్‌ కమిషనరేట్‌ ఏవోస్థాయి అధికారి సహకరించడంతో రూ.కోట్లలో దండుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జైలుకు పంపారు.

జమ్మికుంట పోలీసుస్టేషన్‌ ఎస్సైగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న కదిరె శ్రీకాంత్‌ ఓ మహిళను వేధించిన కేసులో చిక్కుకున్నాడు. శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ వివాహిత ఇంటికి వెళ్లి లైంగికదాడికి పాల్పడ్డట్టు ఆరోపణలొచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 15న వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని సుబేదారి పోలీసుస్టేషన్‌లో శ్రీకాంత్‌పై కేసు నమోదైంది.

వీణవంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇసుక రవాణా ఎక్కువగా జరుగుతుంటుంది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారినుంచి మామూళ్లు వసూలు చేయడంతో పాటు సివిల్‌ వివాదాల్లో తలదూర్చిన ఆరోపణలతో ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

కరీంనగర్‌ క్రైం: చట్టాన్ని కాపాడాల్సిన కొందరు పోలీసులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఖాకీలు భక్షకులుగా మారుతున్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే బాధితులకు అక్కడి సిబ్బంది చేయి తడపనిదే పని జరగక పోగా.. ఇదేంది సారూ అని అడిగితే జులుం ప్రదర్శించడం పలువురు సిబ్బంది వంతవుతోంది. ఇటీవల కాలంలో కరీంనగర్‌ పోలీసు కమిషనరేట్‌ వరుస వివాదాలకు నెలవుగా మారుతుండగా, ఎస్సై నుంచి కానిస్టేబుల్‌ వరకు కొందరు చిక్కుల్లో పడుతున్నారు. ఈ ఒక్క నెలలో మూడు ఘటనలు జరగడం కలంకంగా మారాయి.

రాజకీయ పలుకుబడితో..
పలువురు సిబ్బంది రాజకీయ పలుకుబడితో వారికి నచ్చిన పోలీసు స్టేషన్‌లో పోస్టింగ్‌లు తెచ్చుకొని, ఉన్నతాధికారులు అంటే భయం లేకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా.. పోలీసుశాఖలో అంతర్గత పర్యవేక్షణ వ్యవస్థ బలహీనపడిందా? లేక క్రమశిక్షణ లోపించిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలువురు సిబ్బంది సివిల్‌ వివాదాల్లో తలదూర్చుతూ, ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వివిధ కేసుల్లో స్టేషన్‌ బెయిల్‌ విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఇసుక వనరులు ఉన్నచోట్ల వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారని చెబుకుంటున్నారు. పోలీసుశాఖలో ఎక్కడ ఏంజరిగినా క్షణాల్లో తెలుసుకునే ఎస్‌బీ విభాగం ఏంపనిచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజలకు రక్షణగా నిలవాలి్సనవారు అడ్డదారిలో వెళ్తే, అలాంటివారిపై వ్యవస్థలో పారదర్శకతను పెంచేలా చర్యలు చేపట్టా ల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే ఘటనలు పోలీసుశాఖలో పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement