సాక్షి, చైన్నె: లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించేందుకు ఏప్రిల్ 16 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం సమావేశం మాత్రమే కాదని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మధ్యలో రాష్ట్రాల హక్కులను కాల రాయడానికి కేంద్రం చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. వీడియోలో ఆయన అనేక
అంశాలను ప్రస్తావించారు.
ప్రజలు ఏకం కావాలి
కాగా ఇదే అంశం గురించి టీఎన్సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజన ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలు ఏకం కావాలని పిలుపు నిచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన కుట్రను తిప్పికొట్టేందుకు తమిళనాడు ప్రజలందరూ ఏకమై గొంతు వినిపించాలని కోరారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో, ఏప్రిల్ 16 నుండి 18 వరకు హడావిడిగా పార్లమెంటును సమావేశపరిచి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత (ఏప్రిల్ 29) దీనిపై చర్చించాలన్న విపక్షాల విజ్ఞప్తిని బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పార్లమెంటులో భారీగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రణలో విజయం సాధించినందుకు శిక్షగా తమిళనాడు తనకున్న 39 లోక్సభ స్థానాల నుండి 8 స్థానాలను కోల్పోయి, కేవలం 31 స్థానాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఆత్మగౌరవ నినాదం
‘‘తమకు ఆత్మగౌరవం ఎక్కువ... తమకు పదవుల కంటే సిద్ధాంతాలే ముఖ్యం, రాష్ట్ర హక్కులే ప్రధానం. దివంగత నేతలు అన్నాదురై , కరుణానిధి మాకు నేర్పిన పాఠం ఇదే.... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ స్థాయి పోరాటానికై నా సిద్ధం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని చూస్తే, అది దేశ సమగ్రతకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. తమిళనాడుకు అన్యాయం జరిగితే దేశం స్తంభిస్తుందని స్పష్టం చేశారు. తమర్ని తాను బెదిరించడం లేదని, హెచ్చరిస్తున్నాను’ అంటూ డాక్టర్ అంబేడ్కర్ జయంతి సాక్షిగా చెబుతున్నాను.. తమిళనాడుకు అన్యాయం జరిగితే, భారతదేశం మొత్తం ఇటువైపు తిరిగి చూసేలా చేస్తాం. అని ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ ఆ వీడియో ద్వారా తీవ్ర హెచ్చరిక చేశారు.


