
హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి
– గ్రామస్తుల రాస్తారోకో
తిరువళ్లూరు: తిరుప్పాచ్చూర్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఆదివారం ఉదయం తిరుపతి–చైన్నె జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరువళ్లూరు జిల్లా తిరుప్పాచ్చూర్ గ్రామంలో మూడు వేల కుటుంబాలు నివాసం వుంటున్నారు. ఈ గ్రామం మీదుగా వాహనాలు వేగంగా వెళుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తమ ప్రాంతంలో స్పీడ్బ్రేకర్, హెచ్చరిక బోర్డు, రెఫ్లెక్ట్ బోర్డులను ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు విన్నవించుకున్నారు. అయితే ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఈక్రమంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం ఉదయం రాస్తారోకోకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న తిరువళ్లూరు తాలుకా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వాహనాలు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 40 నిమిషాల పాటు సాగిన ఆందోళనతో రెవెన్యూ అధికారులు వచ్చి గ్రామస్తుల సమస్యల ను పరిస్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.