నిండు కుండగా మేట్టూరు | - | Sakshi
Sakshi News home page

నిండు కుండగా మేట్టూరు

Jun 30 2025 4:03 AM | Updated on Jun 30 2025 4:03 AM

నిండు

నిండు కుండగా మేట్టూరు

కావేరి ఉగ్ర రూపంతో మేట్టూరు జలాశయంలో నీటి మట్టం అమాంతం పెరిగి అన్నదాతల్లో ఆనందాన్ని నింపింది. ఆదివారం జలాశయం నీటి మట్టం 120 అడుగులను సమీపించడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ గేట్లు ఎత్తి వేశారు. ముందు జాగ్రత్తగా డెల్టాలోని ఎనిమిది జిల్లాలోని కావేరి తీర వాసులను అలర్ట్‌ చేశారు. నీటి ప్రవాహం పెరిగే అవకాశాలతో తీరం వెంబడి దండోరా వేయించారు.

ఉబరి నీటి విడుదల

‘డెల్టా’ వైపుగా కావేరి పరవళ్లు

తెరచుకున్న మేట్టూరు గేట్లు

తొమ్మిది జిల్లాలకు అలర్ట్‌

సేలం: కర్ణాటక నుంచి తమిళనాడు వైపుగా కావేరి నది పరవళ్లు తొక్కడంతో 120 అడుగులతో కూడిన డెల్టా అన్నదాతల వరప్రదాయిని మేట్టూరు జలాశయంలోకి నీటి రాక క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. నిర్ణీత జూన్‌ 12వ తేదీన జలాశయం నుంచి సాగు నిమిత్తం నీటిని విడుదల చేశారు. అదే సమయంలో గత రెండు మూడు రోజులుగా నదీ పరివాహక ప్రదేశాలు , కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరి ఉగ్రరూపం దాల్చింది. కావేరి నదిలో హొగ్నెకల్‌ వద్ద సెకనుకు సుమారు 85 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది జలాశయంలోకి సుమారు 75 వేల క్యూ సెక్కులతో ప్రవేశిస్తున్నది. దీంతో శర వేగంగా జలాశయం నీటి మట్టం పెరిగింది. శనివారం రాత్రి సమయంలో 119 అడుగులను నీటిమట్టం దాటడంతో 16 స్లూయిస్‌ గేట్ల ఎత్తి వేసి నీటిని విడుదల చేశారు. నీటి ఉధృతి మరింతగా పెరగవచ్చు అన్న సంకేతాలతో ఆదివారం తిరుచ్చి రీజియన్‌ నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజనీర్ల బృందం జలాశయం,పరిసరాలలో పరిశీలన చేశారు. కావేరిలో నీటి ఉధృతి, మేట్టూరు జలాశయం నిండు కుండగాదర్శనం ఇవ్వడంతో ముందు జాగ్రత్తలపై ప్రభుత్వం ఆదివారం ఉదయాన్నే దృష్టి పెట్టింది. మేట్టూరు జలాశయం మీద ఆధార పడ్డ 13 జిల్లాలోని కావేరి ఉమ్మడి తాగు నీటి పథకాలకు నీటి పంపింగ్‌ విస్తృతం చేయడం, మరో 11 జిల్లాలోని 925 చెరువులకు నీటి మళ్లింపునకు సంబంఽధించిన పరిశీలన విస్తృతం చేశారు.

తీరంలో అలర్ట్‌

ఆదివారం సాయత్రం నిర్ణీత 120 అడుగులకు నీటి మట్టం చేరడంతో ఉబరి నీటిని విడుదల చేస్తూ, ప్రధాన గేట్లను ఎత్తి వేశారు. ప్రస్తుతం 60 క్యూసెక్కుల వరదనీరు కిందికి ప్రవహిస్తోంది. ఈ నీటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున డ్యాం వద్దకు చేరుకున్నారు. ఉబరి( మిగులు) జలాల ఉధృతి అధికంగా ఉండే అవకాశాలతో డెల్టా వైపుగా కావేరి తీరంలో ఉన్న జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తూ చర్యలు చేపట్టారు. సేలం, ఈరోడ్‌, నామక్కల్‌, కరూర్‌, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని తీర గ్రామాల ప్రజలకు ముందు జాగ్రత్తలతో హెచ్చరికలు చేయిస్తూ దండోరా వేయించారు. అలాగే మేట్టూరు జల విద్యుత్‌ కేంద్రం వైపుగా వరద చొచ్చుకు రాకుండా, మేట్టూరు – ఎడపాడి మార్గంలోకి వరద నీరు చొరబడటంతో ఆ మార్గాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రధానంగా రాత్రి సమయంలో నీటి ఉధృతి పెరిగిన పక్షంలో వచ్చే నీటిని పూర్తిగా బయటకు పంపించక తప్పదు. ఈ దృషౠ్ట్య, సేలం, ఈరోడ్‌ జిల్లాలోని లోతట్టు గ్రామాలలోకి వరద నీరు చొచ్చుకు వెళ్లే అవకాశాలు ఎక్కవ కావడంతో అక్కడి ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్తలను విస్తృతం చేశారు. నివాసాలలోకి నీరు చొచ్చుకు వచ్చిన పక్షంలో అక్కడి ప్రజల కోసం శిబిరాలకు చర్యలు చేపట్టారు. భవానీ, కందన్‌ నగర్‌, అందియూరు కూడలి, పాలక్కరై , నేతాజీ నగర్‌, కొడుముడిలో పరిసర లలోకి వరదలు చొచ్చుకు రాకుండా చర్యలు విస్తృతం చేశారు. కావేరి నదీ తీరం వైపుగా వెళ్ల వద్దని ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. కల్వర్టు మార్గాలను, వంతెనలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామాలలో దండోరా వేశారు. ఏ క్షణానైనా నీటి విడుదల శాతం మరింతగా పెరగవచ్చునని, లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత ముందు జాగ్రత్తలతో ఉండాలని హెచ్చరించే పనిలో పడ్డారు.

ఐదేళ్లుగా నిండు కుండగా..

2021, 2022, 2023, 2024లలో నైరుతీరుతు పవనాలు కర్ణాకటలో కరుణించడంతో కావేరి పరవళ్లు తొక్కాయి. దీంతో మేట్టూరు జలాశయం నిండు కుండగా మారింది. కావేరి తీరం వైపుగా ఉబరి నీటిని బయటకు విడుదల చేశారు. గత రెండేళ్లుగా అయితే ఈ జలాశయం పలు మార్లు పూర్తిగా నిండింది. ప్రస్తుతం కూడా నిండు కుండగా మారింది. పూర్తిస్థాయి నీటిమట్టాన్ని రాత్రి సమయంలో చేరడంతో ఉబరి నీటిని విడుదల చేశారు. ఈ దృష్ట్యా, కావేరి తీరప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు. ఉబరి నీటిని సమీపంలోని చెరువులు, చిన్న చిన్నా ఆనకట్టులకు మళ్లీంచే విధంగా విస్తృత చర్యలకు ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

నిండు కుండగా మేట్టూరు 1
1/3

నిండు కుండగా మేట్టూరు

నిండు కుండగా మేట్టూరు 2
2/3

నిండు కుండగా మేట్టూరు

నిండు కుండగా మేట్టూరు 3
3/3

నిండు కుండగా మేట్టూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement