
డీఎంకేతోనే ప్రయాణం
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలలో డీఎంకే కూటమిలోనే తమ పయనం కొనసాగుతుందని ఎండీఎంకే కార్యనిర్వాహక సమావేశంలో తీర్మానించారు. సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా బ్రహ్మాండ పార్టీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఎండీఎంకే కార్యనిర్వహక కమిటీ సమావేశం ఆదివారం చైన్నె ఎగ్మూర్లోని పార్టీ కార్యాలయం తాయగంలో జరిగింది. పార్టీ నేత అర్జున రాజ్ సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ దురై వైగో, పార్టీ నేతలు , నిర్వాహకులు హాజరయ్యారు. జూన్ 22వ తేదీన మదురైలో జరిగిన మురుగన్ మహానాడులో అన్నా, పెరియార్లను కించ పరిచే విధంగా వ్యవహరించిన నిర్వాహకులను తీవ్రంగా ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. తమిళనాడు ప్రజల మత విశ్వాసాలను రాజకీయాలకు వాడుకుంటున్న శక్తులను తరిమి కొటేట దిశగా, బీజేపీ కుట్రలను భగ్నం చేయడానికి కార్యక్రమాలు విస్తృతంగానిర్వహించేందుకు మరో తీర్మానం చేశారు. 2026 ఎన్నికలలోనూ డీఎంకే కూటమిలోనే ఎండీఎంకే పయనం కొనసాగుతుందని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 15న తిరుచ్చి వేదికగా అన్నా 117వ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మాండ సభకు తీర్మానించారు. జూలై 1 నుంచి 17వతేదీ వరకు డివిజన్ల వారీగా పార్టీ నేతలతో సమావేశాలకు నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసి, ప్రజలలోకి చొచ్చుకెళ్లే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఈ సమావేశంలో తీర్మానాలు చేశారు. పాఠశాలలలో వృత్తి విద్యా కోర్సులకు మంగళం పాడే విధంగా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ప్రత్యేకంగా తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించారు.
ఎండీఎంకే భేటీలో నిర్ణయం
సెప్టెంబర్ 15న తిరుచ్చిలో కాన్ఫరెన్స్