
గృహాలకు విద్యుత్ చార్జీల వడ్డన లేదు
సాక్షి, చైన్నె: గృహ విద్యుత్ కనెక్షన్లకు ఎలాంటి చార్జీలను పెంచడం లేదని, రాయితీలు, ఉచిత పథకాలు కొనసాగుతాయని విద్యుత్, రవాణా మంత్రి ఎస్ఎస్ శివశంకర్ స్పష్టం చేశారు. ఏటా జూలై 1వ తేది నుంచి విద్యుత్ చార్జీలను పెంచే దిశగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023లో గృహాలకు ఈ చార్జీలను పెంచ లేదు. 2024లో లోక్ సభ ఎన్నికల అనంతరం నామ మాత్రంగా చార్జీలను వడ్డించారు.తాజాగా జూలై 1వ తేది నుంచి వడ్డన కసరత్తులు మొదలైనట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా వడ్డన భారం ప్రజల నెత్తిన వేస్తే , సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదన్న విషయాన్నిగ్రహించిన పాలకులు వెనుకడుగు వేయడానికి సిద్దమయ్యారు. ఇందులో భాగంగా చార్జీల వడ్డనమీద వస్తున్న వార్తలు,సమాచారాలకు చెక్పెడుతూ ఆదివారంమంత్రి శివశంకర్ ప్రకటన చేశారు. విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి వస్తున్న సమాచారాలకు వివరణాత్మక వివరణ ఇది వరకే ఇచ్చామని గుర్తు చేశారు. మళ్లీ..మళ్లీ అదే ప్రచారం జరుగుతుండటంతో మరో మారు స్పష్టం చేయక తప్పడంలేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చార్జీలను నిర్ణయిస్తుంటుందన్నారు. అయితే, ఈ విషయంగా తాజాగా ఎలాంటి ఉత్తర్వులు అన్నది ఇవ్వలేదన్నారు. ఒక వేళ ఈ వ్యవహారంలో ఏదైనా ఉత్తర్వు జారీ చేసిన పక్షంలో, గృహల విద్యుత్ వినియోగ దారులకు ఎలాంటి సమస్య, ఇబ్బందులుఉండదని స్పష్టం చేశారు. గృహాలకు ఎలాంటి చార్జీల వడ్డన అన్నది ఉండదని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీ పెరుగుదల వల్ల ఎటువంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అందిస్తున్న 100 యూనిట్లు ఉచితంతో సహా అన్ని రాయితీలు, ప్రయోజనాలు కొనసాగుతాయని వివరించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల గురించి అనవసరమైన పుకార్లను నమ్మ వద్ద అని కోరారు.
● మంత్రి శివశంకర్ స్పష్టం