
క్లుప్తంగా
చైన్నెకి రెండో
సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు
● అక్టోబర్ నుంచి అందుబాటులోకి
కొరుక్కుపేట: చైన్నెకి రెండో సబర్బన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలు వచ్చేసింది. లోపాలన్నింటినీ పరిష్కరించిన తర్వాత చైన్నెలో రెండో సబ్బరన్ ఏసీ ఎలక్ట్రిక్ రైలును ప్రారంభించారు. అయితే అక్టోబర్ నెలలో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు తెలిపారు. చైన్నెలో ప్రస్తుతం చైన్నెబీచ్–తాంబరం –చెంగల్పట్టు మార్గాల్లో సెంట్రల్ –అరక్కోణం, సెంట్రల్ –గుమ్మిడిపూండి మార్గాల్లో సబ్బరన్ ఎలక్ట్రిక్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో ఇటీవల బీచ్ నుంచి చెంగల్పట్టు వరకు ఎయిర్ కండీషన్డ్ సబర్బన్ ఎలక్ట్రిక్ రైలును నడిపారు. ప్రారంభమైన రెండు రోజుల్లోనే ఏసీ ఎలక్ట్రిక్ రైలు బోగీ లు చెడిపోవడంతో రైలు ప్రయాణికుల్లో భ యాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిలో రైలు ఆపివేశారు. ప్రస్తుతం బోగీల్లో సమస్యలు పరిష్కరించి, ట్రయల్ రన్ నిర్వహించారు. మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటులో తేనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇరాన్ నుంచి
చైన్నె చేరిన తమిళులు
తిరువొత్తియూరు: ఇరాన్లో చిక్కుకున్న 12 మంది తమిళులు సురక్షితంగా చైన్నెకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో వారికి మంత్రి అవడి ఎస్ఎం నాసర్ స్వాగతం పలికారు. ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ఇజ్రాయిల్, ఇరాన్ దేశాలకు వెళ్లిన తమిళనాడుకు చెందిన పలువురు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తదితరుల వారిని స్వదేశానికి రప్పించడానికి చర్యలు తీసుకున్నారు. దీంతో ఆ దేశాల్లో చిక్కుకున్న 12 మంది తమిళులను యుద్ధ ప్రాతిపదికన చైన్నె కు రప్పించడానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశీ తమిళుల ఆధ్వర్యంలో తమిళనాడుకు తిరిగి రావడానికి చర్యలు తీసుకున్నారు. సంక్షేమశాఖ మంత్రి అవడి ఎస్ఎం నాసర్ చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాల నుంచి 12 మంది చైన్నెకు చేరుకున్నారు. ఆ సమయంలో మంత్రి అవడి ఎస్.ఎం. నాసర్ వారిని స్వాగతించారు. తరువాత చైన్నె సెంట్రల్ రైల్వేస్టేషన్ నుంచి వారిని రైళ్లలో వారి స్వస్థలాలకు పంపించారు.
విజయమే లక్ష్యంగా పనిచేయాలి
తిరుత్తణి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయా లని ఎమ్మెల్యే చంద్రన్ పిలుపునిచ్చారు. తిరుత్తణిలోని కదిర్వేల్ మండపంలో డీఎంకే బూత్ లెవల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. పట్టణంలో డీఎంకే బూత్ కమిటీ సభ్యులకు నూతన సభ్యత్వ నమోదు దరఖాస్తులను ఎమ్మెల్యే చంద్రన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, పధకాలు ద్వారా లబ్ధి పొందిన వివరాలు తెలుసుకుని, వారి సమస్యలు అడిగి పరిష్కరించాలని, పార్టీలో సభ్యులుగా చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలకు పార్టీ సభ్యత్వ నమోదు దరఖాస్తులు అందజేశారు. జూలై నుంచి నూతన సభ్యత్వ నమోదు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యత్వ నమోదులో బీఎల్వోలు, ఐటీ విభాగం ఇన్చార్జ్లు చురుగ్గా పాల్గొనాలని కోరారు. పార్టీ పట్టణ కార్యదర్శి వినోద్కుమార్, మండల కార్యదర్శులు హారతి రవి, కృష్ణన్, రాజేంద్రన్, విజయకుమార్, పట్టణ నాయకులు శ్యామ్సుందర్, అశోక్కుమార్, గణేశన్ తదితరులు పాల్గొన్నారు.
రూ.60 లక్షల విలువైన
బీడీ ఆకులు స్వాధీనం
కొరుక్కుపేట: తూత్తుకుడి ఓడరేవు సమీపంలోని థ్రెస్పురం బీచ్ మీదుగా అనుమానాస్పద వ్యక్తులు పడవ ద్వారా బీడీ ఆకు సంచులను ఆక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో కోస్ట్గార్డు గ్రూప్ ఇన్ స్పెక్టర్ పచ్చిముత్తు పర్యవేక్షణలో కోస్ట్గార్డు గ్రూప్ పోలీసులు బీచ్కు చేరుకున్నారు. పోలీసులు రావటంతో వారిని చూసిన ప్రజలు బీడి ఆకు సంచులను సుముద్రంలోని ఒక కంట్రీ బోట్లో వదిలి అక్కడి నుంచి పారిపోయారు. తరువాత పోలీసులు పడవను స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.60 లక్షల విలువైన 43 సంచులలోని 1,800 కిలోల బీడి ఆకులను సీజ్ చేసి కస్టమ్స్ విబాగానికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు.
మెట్రో రైలు పనుల్లో అపశ్రుతి
● ఇనుప రాడ్డు పడి
కార్మికుడికి తీవ్ర గాయాలు
తిరువొత్తియూరు: కోయంబేడులో మెట్రో రైలు పనులు జరుగుతుండగా ఇనుప రాడ్ పడి ఓ కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాలు.. కోయంబేడు మార్కెట్ సమీపంలోని ఈ– రోడ్డులో మెట్రో రైలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ, శుక్రవారం రాత్రి, మంజంబాక్కంకు చెందిన కార్మికుడు రబు కై వర్క్ ( 34) తన సహోద్యోగులతో కలిసి పనిచేస్తున్నాడు. ఆ సమయంలో ఇనుప కడ్డీలతో కూడిన ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్ ఊహించని విధంగా పై నుంచి పడింది. దీంతో రబు కై వర్క్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కొలత్తూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కోయంబేడు బస్టాండ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.