
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
వేలూరు: రెండు కార్లలో తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆంబూరు రేంజర్ సెంథిల్ అధ్యక్షతన సిబ్బంది అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నాయకనేరి గ్రామం సమీపంలోని నడువూరు గ్రామంలో అనుమానా స్పదంగా కొందరు తిరుగుతున్నట్లు గుర్తించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రిజిష్టేషన్ గల రెండు కార్లు ఉన్నట్లు గుర్తించారు. అటవీశాఖ సిబ్బందిని చూసిన వెంటనే రెండు కార్లతో నిందితులు పరారయ్యారు. దీంతో సినీపక్కీ లో అటవీశాఖాధికారులు వాటిని వెంబడించారు. దీంతో నిందితులు అటవీ ప్రాంతంలోని పుదూరు గ్రామం వద్ద రెండు కార్లను వదిలి పెట్టి, పరారయ్యారు. అటవీశాఖ సిబ్బంది రెండు కార్లును తనిఖీ చేయగా అందులో సుమారు రూ. 20 లక్షలు విలువ చేసే 575 కిలోల ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది రెడ్డితోపు ప్రాంతంలోని అటవీ కార్యాలయంలో అప్పగించారు. అనంతరం ఎర్రచందనం ఎవరు కార్లులో తరలిస్తున్నారు అనే కోణంలో విచారణ జరపగా నాయకనేరి పంచాయతీలోని నడువూరు గ్రామానికి చెందిన ముత్తు కుమారులు రామక్రిష్ణన్, మురుగేషన్గా తెలిసింది. వీరిద్దరూ పరారీ కావడంతో వీరి కోసం గాలిస్తున్నారు. ఈ కార్లు ఆంధ్రప్రదేశ్ రిజిష్టర్ ఉండటంతో ఈ కార్లు ఎవరివి, ఎర్రచందనాన్ని ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నారు.